కంటినొప్పితో ఆసుపత్రికి వెళ్లింది..స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లకు కళ్లు బైర్లు కమ్మాయ్
విశాఖపట్నం: కొద్దిరోజులుగా కంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువతి చికిత్స చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులు రాసిచ్చారు. సుమారు రెండువారాలుగా డాక్టర్లు రాసిచ్చిన మందులను వాడుతున్నప్పటికీ.. కంటి లోపలి పొరల్లో ఆరంభమైన ఆ నొప్పి తగ్గుముఖం పట్టలేదు. దీనితో ఆ యువతి శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె కంటికికి స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన తరువాత డాక్టర్లకు కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. కారణం..
ఆమె కంటి లోపలి పొరల్లో నులి పురుగు తిరుగాడుతుండటమే. ఆ నులిపురుగు చిన్న, చితకది కూడా కాదు. ఏకంగా 15 సెంటీమీటర్ల నులి పురుగు అది. వెంటనే డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహించి, దాన్ని తొలగించారు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఘటన ఇది. ఆ యువతి పేరు భారతి. పెందుర్తిలో నివాసం ఉంటున్నారు. కంటి నొప్పికి స్థానిక డాక్టర్ రాసిచ్చిన మందులు వాడినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోవడంతో ఆమె శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు స్కానింగ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్ చూసిన అక్కడి సీనియర్ డాక్టర్ నజరిన్ వెంటనే శస్త్రచికిత్స చేశారు. నులి పురుగు కావడం వల్ల ఓ చోట స్థిరంగా ఉండలేదు. దీనికోసం రెండుసార్లు ఆపరేషన్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు దాన్ని బయటికి తీయగలిగారు.