ఘనంగా వైసీపీ ఎంపీ మాధవి రిసెప్షన్: హాజరైన సీఎం వైఎస్ జగన్
విశాఖపట్నం: శుక్రవారం తెల్లవారుజామున అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం వారి వివాహ రిసెప్షన్ జరిగింది.

సీఎం జగన్ హాజరు..
సాయిప్రియా రిసార్ట్స్లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులు మాధవి, శివప్రసాద్లను ఆశీర్వదించారు. బంధువుమిత్రులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఘనంగా వివాహం..
కాగా, శుక్రవారం తెల్లవారుజామున అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహం ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో ఎంపీ మాధవి స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున 3.15గంటలకు వీరి పెళ్లి మేళతాళాల మధ్య ఘనంగా జరిగింది.

చిన్ననాటి స్నేహిడితో..
కుటుంబసభ్యులు, బంధువులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. కాగా, కుసిరెడ్డి ప్రసాద్.. మాధవి చిన్ననాటి స్నేహితులు కావడం విశేషం.
పెళ్లి రోజున మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ.. వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోనూ సందడి సాగింది.

నూతన దంపతులకు ఆశీర్వాదం
మాధవి-శివప్రసాద్ల వివాహ వేడుకకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, వైసీపీ నేతలు హాజరై ఆశీర్వదించారు.

చిన్నవయస్సులోనే ఎంపీగా మాధవి...
మాధవి పాతికేళ్ల వయస్సులోనే పార్లమెంటుకు ఎన్నిక కావడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యాయురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధవి.. రాజకీయంగా 30ఏళ్ల అనుభవం కలిగిన కిశోర్ చంద్రదేవ్ను ఓడించారు. మాధవి తండ్రి దేముడు మాజీ ఎమ్మెల్యే కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications