ఆగస్టు 6 డెడ్ లైన్- ఏపీ అధికార, విపక్షాల చూపూ దానిపైనే - మూడు రాజధానులపై తుది నిర్ణయం ?
ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టింది చాలు ఆ తర్వాత ప్రక్రియను జగన్ సర్కార్ పరుగులు పెట్టిస్తోంది. సెలవు రోజుల్లోనూ జీవోలు జారీ చేస్తూ చకచకా దూసుకుపోతోంది. జీవోల జారీ కూడా రహస్యంగా సాగిపోతోంది. ఇదంతా చూస్తున్న వారికి నెల రోజుల్లో రాజధాని తరలింపు పూర్తయిపోతుందా అన్న సందేహాలు కలుగక మానవు. కానీ వాస్తవంగా అతి త్వరలో రాజధాని తరలింపు ఉంటుందా అంటే ప్రభుత్వ వర్గాల నుంచి నో అన్న సమాధానమే వస్తోంది. ఇదే విషయాన్ని టీడీడీ ఛైర్మన్, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కూడా గవర్నర్ సంతకం పూర్తయిన రోజే స్పష్టం చేశారు. మరి ఈ హడావిడి ఎందుకంటే అంతటా వినిపిస్తున్న మాట ఆగస్టు 6 డెడ్ లైన్.
Recommended Video

రాజధానులపై దూకుడు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం వచ్చీ రాగానే ఈ దిశగా ప్రభుత్వం చకచకా జీవోలు జారీ చేస్తోంది. గవర్నర్ సంతకం పూర్తయిన రోజు రాత్రి నాలుగు రహస్య జీవోలు వచ్చేశాయి. వీటిలో ఒకటి మాత్రమే సీఆర్డీయేకు సంబంధించింది కాగా.. మిగతా మూడూ ఇప్పటికీ రహస్యమే. తాజాగా జోన్ల ఏర్పాటు వ్యవహారంలోనూ అదే తీరు. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు ఇలాంటి మరికొన్ని నిర్ణయాలు, ఆదేశాలు కూడా రావొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నా ఇప్పుడు కరోనా కారణంగా వాటిని క్షేత్రస్దాయిలో అమలు చేసే పరిస్ధితి లేదు. మరి అటువంటప్పుడు ఎందుకీ దూకుడన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఆగస్టు 6న ఏం జరగబోతోంది ?
మూడు రాజధానులపై జగన్ సర్కారు దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆగస్టు 6 డెడ్ లైన్ ఉందని ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 6న ఏం జరగబోతోందంటే మాత్రం ఎవరి వద్దా సమాధానం లేదు. దీనిపై ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే రాజధాని తరలింపుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 6న హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ప్రభుత్వం గవర్నర్ వద్ద ఆమోదింపజేసుకున్న మూడు రాజధానుల బిల్లులపైనా అదే రోజు హైకోర్టులో స్పందించబోతోంది. గవర్నర్ సంతకంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తున్నా హైకోర్టు ఈ బిల్లులకు అడ్డుచెబితే మళ్లీ కథ మొదటికొచ్చే ప్రమాదముంది. ఇప్పుడు అమరావతి రైతులతో పాటు ఏపీలో విపక్షాల ఆశ కూడా అదే..

గతంలో హైకోర్టు ఏం చెప్పింది ?
రాజధాని తరలింపుపై దాఖలైన 38 పిటిషన్లను ఏకమొత్తంగా విచారిస్తున్న హైకోర్టు... గత నెలలో జరిగిన విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని తరలింపు రాజ్యాంగ బద్ధమా కాదా అనేది విచారించే ముందు ఇప్పటివరకూ అమరావతికి పెట్టిన వాస్తవ ఖర్చు లెక్కలు చెప్పాలని పిటిషనర్లను కోరింది. ఇందుకోసం అకౌంటెంట్ జనరల్ ను కూడా ప్రతివాదిగా చేర్చాలని సూచించింది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఆగస్టు 6కు పిటిషన్లు వాయిదా వేసింది. కానీ ఆ లోపు గవర్నర్ రాజధాని బిల్లులు ఆమోదించే అవకాశముందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఏదైనా న్యాయసమీక్ష తర్వాతే, మీరు భయపడుతున్నట్లు గవర్నర్ ఆ లోపు బిల్లులు ఆమోదిస్తే అంతా మేం చూసుకుంటామని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కీలకంగా మారాయి.

రైతులు, విపక్షాల ఆశలూ దానిపైనే...
ఆగస్టు 6 లోపు ఏం జరిగినా మేం చూసుకుంటామంటూ హైకోర్టు పిటిషనర్లకు ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రభుత్వంతో పాటు విపక్షాలకూ, అమరావతి రైతులకు కీలకంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం ఆ లోపు రహస్య జీవోలు జారీ చేసి కీలక నిర్ణయాలు వెనువెంటనే తీసేసుకుంటే మూడు రాజధానులపై ఇప్పటికే సగం ప్రక్రియ పూర్తయిందని, ఇప్పుడు ఇందులో జోక్యం చేసుకుంటే నష్టం జరుగుతుందని ప్రభుత్వం వాదించే అవకాశం దొరుకుతుంది. అందుకే ఆగస్టు 6ను డెడ్ లైన్ గా పెట్టుకుని ఈ వరుస ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే విపక్షాలు సైతం ఆగస్టు 6 డెడ్ లైన్ గా భావిస్తున్నాయి. ఆ రోజు రాజధాని బిల్లులపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వబోతోందని విపక్షాలతో పాటు అమరావతి రైతులూ ఆశిస్తున్నారు. ఈ ఆదేశాలు మొత్తం ప్రక్రియనే నిలుపుదల చేసేలా ఉంటాయనేది వారి అభిప్రాయం. ఇలా ఏ విధంగా చూసినా అందరికీ ఆగస్టు 6 డెడ్ లైన్ గా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications