భారత్ పై పాకిస్థాన్ "థర్డ్ ఫ్రంట్ వార్".. ఆ దేశంతో చేతులు కలిపి..!
పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య రకాల రక్షణ సంబంధాలలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రాంతీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య 'ఉమ్మడి సైనిక కమాండ్' ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రతిపాదించినట్లు రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.
బంగ్లాదేశ్ ప్రధాని రక్షణ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) డాక్టర్ ఎ.కె.ఎం. షంసుల్ ఇస్లాంతో పాకిస్థాన్ హైకమిషనర్ ఇమ్రాన్ హైదర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల జూన్ 28న రక్షణ విషయాలపై చర్చించింది. ఢాకా కంటోన్మెంట్లోని ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పరస్పర సహకారం, వృత్తిపరమైన నైపుణ్యాల పెంపు వంటి రక్షణ అంశాలు ఈ అధికారిక ఎజెండాలో ఉన్నప్పటికీ, తెరవెనుక ఉమ్మడి సైనిక కమాండ్ ప్రతిపాదన గురించి లోతుగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
1971 విముక్తి పోరాటంలో పాకిస్థాన్ పై పోరాడి స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్, ఇప్పుడు తిరిగి అదే దేశంతో సైనిక పరంగా చేతులు కలపడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఈ నూతన పరిణామం పొరుగు దేశమైన భారత్కు తీవ్ర వ్యూహాత్మక ఆందోళనలను కలిగిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ (చికెన్స్ నెక్) ప్రాంతానికి బంగ్లాదేశ్ సమీపంలో ఉండటమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.
దక్షిణాసియా పరిధిలో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి మూడు వైపుల భద్రతా సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని దేశ రక్షణ రంగా నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఢాకా, ఇస్లామాబాద్ మధ్య పెరుగుతున్న రక్షణ సమీకరణాలు భారత సరిహద్దు భద్రతకు కొత్త సవాళ్లను విసరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చైనా యుద్ధ విమానాల కొనుగోలుపై దృష్టి
ఇదిలా ఉండగా, పాకిస్థాన్ నుంచి జెఎఫ్-17 (JF-17) మల్టీరోల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ గతంలో జరిపిన చర్చలు ప్రస్తుతం నిలిచిపోయాయి. దీనికి బదులుగా, చైనాకు చెందిన 24 జె-10సి (J-10C) రకం యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ప్రత్యామ్నాయ చర్చలు జరుపుతోంది. బీజింగ్ మరియు ఇస్లామాబాద్ ప్రభావంతో ఢాకా తీసుకుంటున్న ఈ సైనిక నిర్ణయాలు ఈ ప్రాంతంలో సరికొత్త వ్యూహాత్మక మార్పులకు వేదికవుతున్నాయి.

ఉమ్మడి సైనిక కమాండ్ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరు దేశాల ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఒకవేళ ఈ సైనిక ఒప్పందం కుదిరితే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక మార్పులు రావడం ఖాయం. ఈ పరిణామాలు భారత్ పశ్చిమ, తూర్పు సరిహద్దు ప్రాంతాలలో ఎలాంటి భద్రతా సమీకరణాలకు దారితీస్తాయో నిరంతరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications