విశాఖ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయింపు ...ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై ఆసక్తికర చర్చ
ఏపీ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి శర వేగంగా అడుగులు వేస్తోంది. ఒకపక్క కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన గంటలోపే స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణాలు ప్రారంభించడానికి కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవోను విడుదల చేసింది.

కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ.. స్టేట్ గెస్ట్ హౌస్ కు భూ కేటాయింపు చేసిన సర్కార్
గెస్ట్ హౌస్ నిర్మాణం ప్రారంభించడం కచ్చితంగా కోర్టు ధిక్కరణకు పాల్పడటమేనని హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగిన కాసేపటికే ఈ జీవో విడుదల చేయడంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటుచేసి తీరుతామన్నపట్టుదల ఏపీ ప్రభుత్వంలో కనిపిస్తోంది.అందులో భాగంగానే విశాఖ లో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

30 ఎకరాలు స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు .. అర్జెంట్ అంటూ
కాపులుప్పాడ లో గ్రేహౌండ్స్ కు చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాలు స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు .ఈ మేరకు స్థలం కేటాయింపుకు అవసరమైన రికార్డుల రూపకల్పనను అత్యవసర వ్యవహారంగా పరిగణించాలని పేర్కొన్నారు. అర్జెంట్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడం చూస్తే ఏపీ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఏర్పాటు విషయంలో చాలా సీరియస్ గా ఉంది అన్న అంశం అర్థమవుతుంది. స్థలం కేటాయింపు తదితర అంశాలలో త్వరిత గతిన ముందుకు వెళ్లాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ... హడావిడిగా ప్రభుత్వ నిర్ణయం
జీవో నెంబర్ 1353 ను జారీచేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ కాపులుప్పాడ కొండపై 30 ఎకరాలు గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ కు బదలాయిస్తూ హడావిడిగా ఆదేశాలు జారీ చేశారు.రాజధాని బిల్లులపై జరిగిన విచారణలో న్యాయవాది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ గెస్ట్ హౌస్ కు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో విశాఖపట్నం లో భూమి పూజ చేయడం కోర్టు ధిక్కరణ అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడాన్నిబట్టి, కార్యనిర్వహక రాజధాని పనులను ప్రభుత్వం చేపట్టినట్టే అని పేర్కొనడంతో, దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

విశాఖ పరిపాలనా రాజధానిగా .. పనుల్లో వేగం పెంచుతూ మరోసారి స్పష్టం
ఇది జరిగిన గంటలోపే స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం కోర్టుల్లో ఎన్ని పిటీషన్లు దాఖలైనా , రాజధాని ప్రాంత రైతులు నిరవధికంగా ఆందోళనలు కొనసాగిస్తున్నా సరే పరిపాలనా రాజధానిగా విశాఖ నిర్ణయానికే కట్టుబడి పని చేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతున్నారు.












Click it and Unblock the Notifications