కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు..!?
విశాఖపట్నం: ఇవ్వాళ ప్రముఖ కాపు నేత, దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి. 1988 డిసెంబర్ 26వ తేదీన రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. విజయవాడలో నిరాహార దీక్ష శిబిరంలోనే ఆయనను మట్టుబెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వంగవీటి రంగా హత్యకు గురి కావడం పెను సంచలనానికి దారి తీసింది. అప్పటి తీవ్రత ఇప్పటికీ కొనసాగుతోంద
వంగవీటి రంగా చుట్టూ..
వంగవీటి రంగాది రాజకీయ హత్యగా దీన్ని అభివర్ణిస్తుంటారు టీడీపీయేతర పార్టీలు, కాపు నాయకులు. ఇప్పటికీ అదే అభిప్రాయం ఆయా నేతల్లో నెలకొని ఉంది. ఇవ్వాళ కూడా అది ప్రతిధ్వనించింది. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం సహా అన్ని పక్షాలు కూడా ఆయనకు నివాళి అర్పించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో మరోమారు వంగవీటి రంగా పేరు మారుమోగింది.
విశాఖలో కాపు నాడు..
వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని అటు విశాఖపట్నంలో కూడా కాపు నాడు నాయకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాధా-రంగా ఆర్గనైజేషన్ నాయకులు దీన్ని నిర్వహించారు. ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్లో ఈ సభ ఏర్పాటైంది. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం.. ఈ సభకు హాజరు కాలేదు గానీ బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన పార్టీ నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు.
జీవీఎల్ డిమాండ్..
బీజేపీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఈ సభలో పాల్గొన్నారు. కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కాపు సామాజిక వర్గానికి సంపూర్ణ రాజ్యాధికారం దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికోసం బీజేపీ ఎప్పుడు ముందు ఉంటుందని హామీ ఇచ్చారు. కాపులను కేవలం ఓటుబ్యాంకుగా చూసే వైఎస్ఆర్సీపీ, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని జీవీఎల్ అన్నారు.
కృష్ణాజిల్లాకు రంగా పేరు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని, వాటన్నింటికీ కొత్త పేర్లను పెట్టిందని జీవీఎల్ గుర్తు చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో రంగా భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని జీవీఎల్ అన్నారు. ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గ నాయకులకు అధికవాటాను కల్పించాలని చెప్పారు.
సీఎం పదవే కావాలి..
జనసేన నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ- ఇప్పటికే తాము ఇద్దరు కాపు నాయకులను కోల్పోయామని, ఇక ఉన్నది ఒక్కరేనంటూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ లేకపోతే కాపులకు మరో రాజకీయ నాయకుడు లేరని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనుక నిలబడాలని సూచించారు. రిజర్వేషన్లు రాకపోయినా ఫర్వాలేదని, ఈ అయిదు శాతం రిజర్వేషన్ల కంటే ముఖ్యమంత్రి పదవే దక్కాలని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన సామాజిక వర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని పేర్కొన్నారు.