వైఎస్ జగన్ నెత్తిన పాలుపోసిన తెలుగుదేశం: విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించిన కేంద్రం
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి.. రెండు సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ- ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని తరలించాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమాలు.. తెలుగుదేశం పార్టీ ఆందోళనలు మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత అడ్డంకిని కల్పించాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత ఆటంకాన్ని కలిగించింది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ఈ ఏడాది పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది జగన్ సర్కార్.
కర్నూలులో హెచ్ఆర్సీ
మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా- రాయలసీమ ప్రాంతంలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనేది జగన్ సర్కార్ కాన్సెప్ట్. ఇప్పుడున్న అమరావతిని చట్టసభల రాజధానిగా కొనసాగిస్తూ.. సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే జ్యుడీషియల్ అధికారాలు కలిగి ఉన్న మానవ హక్కుల కమిషన్ను న్యాయ రాజధాని కర్నూలుకు తరలించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది.
విశాఖకు ప్రయాణం..
అటు పరిపాలన రాజధాని, ఇటు న్యాయ రాజధానిలో ఒకేసారి కార్యకలాపాలను సాగించాల ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు రాజధానుల్లో పరిపాలన సాగించేలా ఏర్పాట్లు చేస్తోన్నట్లు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలోని సచివాలయాన్ని విశాఖపట్నానికి, ఏపీ హైకోర్టును కర్నూలుకు ఒకేసారి తరలించేలా మాస్టర్ప్లాన్ను జగన్ సర్కార్ రూపొందించిందని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టిందని సమాచారం. ఒకేసారి తరలింపు ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తుందనే వాదన ఉంది.
విశాఖను కేంద్రం గుర్తించినట్టే..
ఇదంతా ఒక ఎత్తయితే.. విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించడం మరో ఎత్తు. ఏపీ రాజధానిగా వైజాగ్ను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అనెక్సర్ను విడుదల చేసింది. కిందటి నెల 26వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేరళలోని కన్నూర్ లోక్సభ సభ్యుడు కుంబకూడి సుధాకరన్, అస్సాంలోని నోవ్గావ్ సభ్యుడు ప్రద్యుత్ బొర్డొలాయ్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం సందర్భంగా ఏపీ రాజధాని వైజాగ్ అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరలతో ముడిపెట్టి..
రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు సంబంధించిన ప్రశ్న అది. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆ ఇద్దరు సభ్యులకు లిఖితపూరకంగా సమాధానం ఇచ్చింది. దీనికోసం జారీ చేసిన అనెక్సర్లో ఏపీ రాజధాని అనే కాలమ్లో వైజాగ్ అనే పేరును పొందుపరిచింది. ఈ అనెగ్సర్ను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీనితో ఇది పెద్దగా ప్రచారంలోకి రాలేదు. మీడియా దృష్టిని కూడా ఆకర్షించలేదు.
వెలుగులోకి తెచ్చిన టీడీపీ..
ఈ అనెగ్సర్ను తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తీసుకుని రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనలు, ఆందోళనలను నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విడుదల చేసిన ఈ అనెక్సర్ను ప్రచారంలోకి తీసుకొచ్చింది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో మాత్రమే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతోన్నాయని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించిందంటూ ఈ అనెక్సర్ను మీడియాకు విడుదల చేసింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల పేర్లు..
దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు, వాటి రాజధానులు.. అక్కడ విక్రయమౌతోన్న పెట్రోల్, డీజిల్ ధరలును ఇందులో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల పేర్లు పక్కన వాటి రాజధానులను మెన్షన్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కేపిటల్ అనే చోట వైజాగ్ అనే పేరును ప్రచురించింది. దీనితో ఒకరకంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా గుర్తించిందంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.