సౌత్లోనే అతిపెద్ద షాపింగ్ మాల్- విశాఖలో జగన్ భూమిపూజ
అమరావతి: ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోన్న సాగర నగరం విశాఖపట్నంలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇనార్బిట్ మాల్ నిర్మితం కాబోతోంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోతోంది. దీని నిర్మాణ వ్యయం 600 కోట్ల రూపాయలు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇంతపెద్ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ మరెక్కడా లేదు. దీనికి సంబంధించి ప్రాథమిక ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం దీని నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఇనార్బిట్ మాల్తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన 50 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారాయన. వీటి విలువ 136 కోట్ల రూపాయలు. వైఎస్ జగన్ విశాఖ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇదివరకే విడుదలయింది. మంగళవారం ఉదయం 9:30 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు.
10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారు. 10:45 నిమిషాలకు విశాఖపట్నానికి చేరుకుంటారు. 11:15 నిమిషాలకు కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్కు భూమిపూజ చేస్తారు వైఎస్ జగన్. 12:20 నిమిషాల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 12:25 నిమిషాలకు జీవీఎంసీ పరిధిలో 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం సిరిపురం ఏయూ క్యాంపస్కు బయలుదేరి వెళ్తారు. 12:40 నిమిషాలకు క్యాంపస్కు చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయో మానిటరింగ్ హబ్తో పాటు మరో నాలుగు భవనాలను వైఎస్ జగన్ ఇనాగ్యురేట్ చేస్తారు. 1:20 నిమిషాలకు బీచ్ రోడ్లో గల ఏయూ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో ముఖాముఖి పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణమౌతారు.
జగన్ పర్యటన ఏర్పాట్లను వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కోఆర్డినేటర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షించారు. మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మాణం జరుపుకోనుందని, దీనివల్ల ఈ ప్రాంతవాసులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ ప్రాధాన్యత ఇస్తోన్నారని వివరించారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్, మూలపేట పోర్ట్, వైజాగ్ టెక్నాలజీ పార్క్, ఒబేరాయ్ హోటల్స్ నిర్మాణంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. విశాఖలో మరిన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతోన్నాయని, వాటివల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications