Cyclone Hamoon: పొంచివున్న తుఫాన్: ఏపీకి భారీ వర్ష సూచన
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ మధ్యాహ్నం లేదా రాత్రి నాటికి వాయుగుండంగా మారనుంది. వచ్చే 24 గంటల వ్యవధిలో తుఫాన్గా రూపు దాల్చనుంది. దీని ప్రభావం ఏపీ సహా మరో రెండు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడింది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి ఆగ్నేయ దిశగా 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఈ అల్పపీడనం తుఫాన్గా మారనుంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

దీనికి హమూన్ (Cyclone Hamoon) అని పేరు పెట్టారు. ఇరాన్.. ఈ పేరును సూచించింది. ఈ నెల 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 25వ తేదీ వరకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షలు కురుస్తాయి.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి తుఫాన్ కదిలే అవకాశం ఉండటం వల్ల ఈ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు.
తీరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి ఇది కదలబోతోండటం వల్ల తుఫాన్ ప్రభావం ఏపీ, ఒడిశాపై తీవ్రంగా ఉండకపోవచ్చని భువనేశ్వర్లోని భారత వాతావరణ కేంద్రం రీజినల్ డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ చెప్పారు. తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్లో భారీ వర్షలు కురుస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications