విశాఖ రూపురేఖలు మారిపోనున్నాయ్..: సాగర నగరానికి విదేశీ హంగులు
ఏపీ భవిష్యత్ పరిపాలన రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నం రూపురేఖలు మారిపోనున్నాయి. మూడు మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. దీనికి అవసరమైన ఒప్పందాలను కుదుర్చుకోనుంది ప్రభుత్వం
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం రూపు రేఖలు మారిపోనున్నాయి. ఏపీ పరిపాలన రాజధానిగా అవతరించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో- భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. విదేశీ హంగులు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ఒప్పందాలను జగన్ ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. త్వరలో ఏర్పాటు కాబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఈ ఒప్పందాలపై సంతకాలు చేయనుంది.

గ్లోబల్ సమ్మిట్..
ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 14,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ఇది. అదాని గ్రూప్ ఆఫ్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ దీన్ని నెలకొల్పనున్నారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ను ఏడు సంవత్సరాల వ్యవధిలో దశలవారీగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అదాని సంస్థలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది.

24,000 మందికి జాబ్స్..
ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక- 24,000 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ ను నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం 2021లో విశాఖపట్నంలో 130 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో 20 సంవత్సరాల పాటు పన్ను రాయితీని కూడా ఇవ్వడానికి అంగీకరించింది.

మూడు మెగా ప్రాజెక్టులు..
తాజాగా మరో మూడు మెగా ప్రాజెక్టులు విశాఖపట్నంలో రూపుదిద్దుకోనున్నాయి. స్కై టవర్, టన్నెల్ అక్వేరియం, జెయింట్ వీల్ ను ఏర్పాటు కానుంది. ముగ్గురు ఎన్ఆర్ఐలు, విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. టర్కీకి చెందిన పోలిన్ అక్వేరియం సహకారంతో టన్నెల్ అక్వేరియం నిర్మితం కానుంది. దీని నిర్మాణ వ్యయం 250 కోట్ల రూపాయలు.

స్కై టవర్..
స్కై టవర్ ను నిర్మించడానికి స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటామిన్ వరల్డ్ వైడ్ కంపెనీ ముందుకొచ్చింది. 100 కోట్ల రూపాయలతో ఇది ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ఐ ఆన్ వైజాగ్ ప్రాజెక్ట్ కోసం రష్యాకు చెందిన ప్యాక్స్ కంపెనీ ఆసక్తి చూపింది. 243 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ తో లండన్ ఐ తరహాలో భారీ జెయింట్ వీల్ ను నిర్మించనుందీ సంస్థ.

మంగమారిపేట్ బీచ్ ఫ్రంట్ వద్ద..
విశాఖపట్నం- భీమిలీ మధ్య ఉండే మంగమారిపేట బీచ్ ఫ్రంట్ వద్ద ఈ మూడింటినీ నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన భూముల కేటాయింపును త్వరలోనే చేపట్టేనుంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా ఏపీ ప్రభుత్వంతో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలపై సంతకాలు చేయనున్నాయి ఆయా కంపెనీలు.

ఐ ఆన్ వైజాగ్..
లండన్ ఐని పోలి ఉంటుందీ ఐ ఆన్ వైజాగ్. ఈ మెగా జాయింట్ వీల్ నుంచి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ కింద అభివృద్ధి చేయనుంది ఏపీ ప్రభుత్వం. దేశంలోనే మొట్టమొదటి మెగా జెయింట్ వీల్ ప్రాజెక్ట్ ఇది. ప్రపంచంలోని టాప్ 10లో ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని సీటింగ్ కెపాసిటీ 440గా ప్రాథమికంగా నిర్ధారించింది. 440 మంది ఒకేసారిఈ వీల్ ను రైడ్ చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్ ఇవే..
ఇందులో అమర్చే వీల్ ఎత్తు 125 మీటర్లు ఉంటుంది. గాజుతో తయారు చేసిన క్యాబిన్లు ఇందులో ఉంటాయి. అవన్నీ ఎయిర్ కండీషన్డ్ తో కూడుకుని ఉంటాయి. 8.3 తీవ్రతతో భూకంపాలు వచ్చినా ఈ జెయింట్ వీల్ తట్టుకోగలుగుతుంది. అలాగే 220 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినప్పటికీ.. ఇది చెక్కు చెదరదు. బీచ్ రోడ్డులోని కాపులుప్పాడలో 15 ఎకరాల్లో ఇది ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

తాబేలు ఆకారంలో..
రెండో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. వైజాగ్ అక్వేరియం. విశాఖపట్నం బీచ్ రోడ్లో ఇది నిర్మితం కానుంది. తాబేలు ఆకారంలో ఈ అక్వేరియాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దేశంలోనే మూడో అతి పెద్ద పబ్లిక్ అక్వేరియంగా ఇది రూపుదిద్దుకోనుంది. సుమారు 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతుంది.

ఆసియాలోనే ఎత్తయిన స్కైటవర్..
పీపీపీ విధానంలో స్కై టవర్ ప్రాజెక్ట్ రూపుదాల్చనుంది. దీని నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయలు. ఆసియాలోనే అతి ఎత్తయిన స్కైటర్ గా దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం నగరంలో ఏ ప్రాంతం నుంచైనా ఈ స్కైటవర్ కనిపించేలా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ మూడు ప్రాజెక్టుల వల్ల విశాఖపట్నానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకుని రావొచ్చని భావిస్తోంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications