విశాఖ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం... తప్పిన పెను ప్రమాదం...
విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఉన్న కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగడంతో పరిస్థితి త్వరగానే అదుపులోకి వచ్చింది.
Recommended Video
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో కరోనా పేషెంట్లను మరో బ్లాక్కి తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు,ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేసినట్లు క్వారెంటైన్ సిబ్బంది తెలియజేశారు. ప్రమాదం నుంచి బయటపడటంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా,ఈ నెల 9న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ 19 సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయారు. రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ హోటల్ను తాత్కాలిక కోవిడ్ 19 కేంద్రంగా మార్చారు.
ఆస్పత్రిలో పడకల కొరత కారణంగా కరోనా పేషెంట్లకు ఇందులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలోనే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్వర్ణ ప్యాలెస్ను కోవిడ్ 19 చికిత్సా కేంద్రంగా మార్చేందుకు అగ్నిమాపక శాఖ నుంచి రమేష్ ఆస్పత్రి ఎన్ఓసీ తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.