16 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వర్షం.. ప్యార్ను గుర్తుచేసిన గులాబ్.. విశాఖలో ఇలా
గులాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆదివారమే దాటివేసింది. తీరం దాటిన తర్వాత విశాఖ నగరంలో భారీ వర్షం కురిసింది. 24 గంటల్లో 282 మిల్లీ మీటర్ల భారీ వర్షం సోమవారం నమోదయ్యింది. సెప్టెంబర్ నెలలో ఈ స్థాయిలో వర్షం కురిసి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఈ మధ్యలో ఈ స్థాయిలో వర్షం ఎప్పుడూ కురవలేదు. 16 ఏళ్ల క్రితం 2005లో ప్యార్ తుఫాన్ వల్ల భారీ వర్షపాతం రికార్డయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయిలో వర్షం ఇప్పుడే వచ్చింది.
బే ఆఫ్ బెంగాల్, కలింగపట్నం వద్ద అప్పుడు ప్యార్ తుఫాన్ తీరం దాటింది. ఆ సమయంలో విశాఖలో 194 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు గులాబ్ తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో 51 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాన్ ప్రభావం కోస్తాంధ్రపై ఎక్కవ ప్రభావితం చూపుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఛత్తీస్ గడ్, తెలంగాణ,విదర్భలో కూడా సోమవారం వర్షాలు కురుస్తాయని వివరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, నిజామాబాద్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. గోదావరి, కృష్ణా, కోరాపుట్, దంతేవాడ, బీజాపూర్, బస్తర్, కంకేర్, వరంగల్, అర్బన్ రంగారెడ్డి జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీచేశారు.
గత 24 గంటల్లో శ్రీకాకుళంలో భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళంలో 150 మిల్లీమీటర్ల వర్షం పడింది. కళింగపట్నంలో 126 మి.మీ, గోదావరిలో 120 మి.మీ, కాకినాడలో 113 మిమీ, విజయవాడలో 108 మి.మీ, కృష్ణాలో 110 మిమీ, యానాంలో 90 మి.మీ వర్షం కురిసింది.
ఇటు భాగ్యనగరంలో కూడా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచే జల్లులు కురుస్తున్నాయి. ఒకానొక సమయంలో ఎక్కువే పడింది. వర్షం కురవడంతో సిటీ ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. వర్షంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావడం లేదు. గొడుగు తీసుకొని మరీ వస్తున్నారు. ఇళ్ల నుంచి జనం బయటకు రావొద్దని అధికారులు సూచించారు.