విశాఖ తీరంలో కలకలం: కొట్టుకొచ్చిన భారీ షిప్: అందులో?: ఈదురు గాలులు, బలమైన అలల ధాటికి
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ఇటు తూర్పు గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావానికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.
Recommended Video
వాయుగుండం ప్రభావంతో విశాఖలో కొన్ని గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. 24 గంటల వ్యవధిలో విశాఖపట్నంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పరవాడలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గాజువాక-17, భీమిలి-16 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
వాయుగుండం ప్రభావం వల్ల విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు మరి కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశారు. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. వాయుగుండం ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఎగిసి పడుతున్నాయి. వాటి ధాటికి ఓ భారీ నౌక తీర ప్రాంతానికి కొట్టుకుని వచ్చింది. విశాఖపట్నం తెన్నేటి పార్క్ తీర ప్రాంతం సమీపంలోకి చేరుకుందా నౌక.
విశాఖ తీరంలో కలకలం: కొట్టుకొచ్చిన భారీ షిప్: అందులో?#weather #Heavyrains #Visakhapatnam pic.twitter.com/frQm8hSSSJ
— oneindiatelugu (@oneindiatelugu) October 13, 2020
తీరానికి కొట్టుకొచ్చిన నౌకను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అందులో నౌక సిబ్బంది ఉన్నట్లు సమాచారం లేదు. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది? ఎవరికి చెందినది? అనే అంశంపై స్థానిక అధికారులు ఆరా తీస్తున్నారు. దాని మీద M.V. MAA HT-194 అనే అక్షరాలు రాసి ఉన్నాయి. మర్చంట్ షిప్గా భావిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఈదురు గాలులు, బలమైన అలల ధాటికి తీరానికి కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.