ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ నివేదిక, నిన్నటి మంత్రివర్గ భేటీ రాజధాని ప్రకటన వాయిదా వంటి తాజా పరిణామాలు ఏపీలో రాజకీయ అనిశ్చితికి కారణంగా మారాయి. ఏపీ రాజధాని ముక్కలు కాబోతుంది అనే విషయాన్ని సీఎం జగన్ తన చర్యలతో చెప్పేశారని టీడీపీ ఆరోపిస్తుంటే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు తగ్గాక రాజధాని ప్రకటన చెయ్యాలని అందుకోసం మరోసారి కమిటీ నివేదికల సమీక్ష కోసం హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .

భీమిలిలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం ?
అయితే రాజధాని మార్పు ఖాయమని ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం వున్న అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని చెప్పిన సీఎం జగన్ ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ను తీర్చిదిద్దుతామని పేర్కొన్న నేపధ్యంలో అక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి . అయితే విశాఖలోని భీమిలి లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం కానుందని విజయసాయి పదేపదే చెప్పటంతో అసలు భీమిలి వాసులు రాజధాని ఏర్పాటు విషయంలో సుముఖంగా ఉన్నారా లేదా అన్న చర్చ జరుగుతుంది.

భీమిలిలో ప్రభుత్వ భూములపై సర్వే
ప్రస్తుతం భీమిలిలోని ప్రభుత్వ భూములపై సర్వే జరుగుతుందని చెప్పిన విజయసాయి అక్కడే రాజధాని ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. భీమిలి పరిసర ప్రాంతాలలో 4000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. నగరానికి ఆనుకుని ఉన్న విశాఖ గ్రామీణ, విశాఖ అర్బన్ , ఆనందపురం , భీమిలి ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది అని జిల్లా కలెక్టర్ తెలిపారు. భీమిలి రాజధాని అని వైసీపీ నేత విజయ సాయి చేసిన ప్రకటనపై భీమిలి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్సైడర్ ట్రేడింగ్ రగడ నేపధ్యంలో భయపడుతున్న భీమిలి వాసులు
చారిత్రక నేపధ్యం ఉన్న భీమిలి అభివృద్ధికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే కొందరు మాత్రం భయపడుతున్నారు. తాజాగా రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి రచ్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు భీమిలి పరిసర ప్రాంతాల్లో సర్వే చేస్తున్న అధికారులు అక్కడి రైతులతో మాట్లాడుతున్నారు. దీంతో వారు భవిష్యత్ లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు.

నేరెళ్ళ వలసలో ల్యాండ్ పూలింగ్ కు సిద్ధమైన అధికారులు
భీమిలి మండలం నిడిగట్టు పంచాయతీ నేరెళ్లవలసలో వున్న ఎర్రమట్టిదిబ్బల ప్రాంతంలో ప్రస్తుతం అధికారులు సర్వే చేస్తున్నారు. ఇక అక్కడ ప్రభుత్వ డి.పట్టా భూముల ల్యాండ్ పూలింగ్కు రైతులు నిరాకరిస్తున్నారు. ఎర్రమట్టిదిబ్బలలో ఎస్సీ రైతులకు గతంలో ప్రభుత్వం డి.పట్టాలు మంజూరు చేసింది. ఆయా భూములలో రైతులు జీడిమామిడి, సరుగుడు తోటల పెంపకంతో జీవిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో నేరెళ్లవలసలో ప్రభుత్వ డి.పట్టా భూముల ల్యాండ్పూలింగ్కు అధికారులు సన్నద్ధమయ్యారు.

రైతుల నుండి మిశ్రమ స్పందన
అయితే సాగుదారులైన రైతులలో కొంతమంది ప్రభుత్వానికి భూములు అప్పగించడానికి అంగీకరిస్తున్నారు. మరి కొంతమంది భూములు ఇచ్చేదిలేదని తేల్చి చెప్తున్నారు. అసలు రాజధాని అక్కడ ఏర్పాటు చేసినా అది ఎంత కాలం కొనసాగుతుందో అన్న ఆందోళనలో ఉన్న రైతులు, రాజధాని రైతుల్లాగే తమ పరిస్థితి కూడా మారుతుందేమో అన్న అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ల్యాండ్ పూలింగ్ కు మిశ్రమ స్పందన వస్తుంది.












Click it and Unblock the Notifications