APSRTC బస్సుల్లో ప్రయాణించిన రోహిత్ సేన..: బీసీసీఐ ఖుష్
రెండో వన్డే మ్యాచ్ ఆడటానికి విశాఖపట్నానికి వచ్చిన భారత్, ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లకు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీకి చెందిన డాల్ఫిన్ బస్సుల్లో వారు రాకపోకలు సాగించారు.
ముంబై: విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా ఆస్ట్రేలియా (IND vs AUS)తో జరిగిన రెండో వన్డే (2nd ODI)లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ముంబై వాంఖెడే స్టేడియంలో జరిగిన తొలి వన్డే దూకుడును ఇక్కడ కొనసాగించలేకపోయింది రోహిత్ సేన. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. మూడు వన్డేల సిరీస్ లో 1-1తో సమవుజ్జీగా నిలిచింది.

వారిద్దరే..
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 26 ఓవర్లల్లో 117 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలవలేకపోయారు. 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్కడే టాప్ స్కోరర్. లోయర్ ఆర్డర్ లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) 29 పరుగులతో కొంత మేర ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. మిఛెల్ స్టార్క్ (Mitchell Starc) అయిదు వికెట్లతో చెలరేగాడు. సీన్ అబాట్ (Sean Abott) ఆరు ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లీస్ (Nathan Ellis)- 2 వికెట్లు తీసుకున్నాడు.

11 ఓవర్లలోనే..
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 11 ఓవర్లల్లోనే మ్యాచ్ ను ఫినిష్ చేసింది. వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్, ట్రవిస్ హెడ్.. టీమిండియా బౌలర్ల దుమ్ము దులిపారు. స్టేడియంలో మినీ తుఫాన్ ను సృష్టించారు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు వారిద్దరూ. 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు మిఛెల్ మార్ష్. 66 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో ట్రవిస్ హెడ్ అదే స్థాయిలో దూకుడుగా ఆడాడు. 30 బంతుల్లో 10 బౌండరీలతో 51 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు.

చుక్కలు చూపారు..
భారత బౌలర్లను ఉతికి ఆరేశారు ఆసీస్ ఓపెనర్లు. ప్రత్యేకించి మహ్మద్ సిరాజ్ పై విరుచుకుపడ్డారు. 3 ఓవర్లు సంధించిన సిరాజ్.. ఓవర్ కు 12కు పైగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఏకంగా 37 పరుగులను సమర్పించుకున్నాడు. మహ్మద్ షమీ విసిరన మూడు ఓవర్ల నుంచి 29 పరుగులను పిండుకున్నారు. అక్షర్ పటేల్ పరిస్థితీ అంతే మూడు ఓవర్లల్లో 25 పరుగులు ఇచ్చుకున్నాడు అక్షర్. హార్దిక్ పాండ్యా వేసిన ఒకే ఓవర్ లో 18 పరుగులను రాబట్టుకున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో..
కాగా- ఈ మ్యాచ్ కోసం విశాఖపట్నానికి వచ్చిన ప్లేయర్ల రవాణా అవసరాల కోసం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)అధికారులు బస్సులను సమకూర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా ఏ నగరంలోనైనా మ్యాచ్ లు జరిగితే- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)/ ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు ప్లేయర్ల కోసం లగ్జూరియస్ ప్రైవేట్ బస్సులను సమకూర్చుతుంటాయి. విశాఖపట్నంలో మాత్రం దీనికి భిన్నమైన సన్నివేశం కనిపించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులను వారు వినియోగించుకున్నారు.

బీసీసీఐ విషెస్..
విలాసవంతమైన డాల్ఫిన్ క్రూయిజ్ (Dolphin cruise) బస్సులను ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం డిపో అధికారులు క్రికెటర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. మ్యాచ్ కు ముందు తాము బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లోనే చేరుకున్నారు. మ్యాచ్ ముగిసిన తరవుాత కూడా అవే బస్సుల్లో వారు హోటల్ కు చేరుకున్నారు. లగ్జరీ బస్సులను సమకూర్చినందుకు బీసీసీఐ (BCCI) అధికారులు.. ఏపీఎస్ఆర్టీసీకి విషెస్ తెలిపారు.












Click it and Unblock the Notifications