విశాఖ మెడ్ టెక్ జోన్ నుంచి కరోనా కిట్లేవీ... ? అప్పుడు మేమంటే మేము.. ఇప్పుడంతా మౌనం...
గెలుపుకి తండ్రులెక్కువ... ఓటమి మాత్రమే అనాథ అనేది ఓ సామెత. సరిగ్గా ఈ సామెతనే ఓ రేంజ్ లో వంటబట్టించుకునే మన రాజకీయ నేతలు.. ఏదైనా ఘనకార్యం జరిగిందంటే అతి మా ఘనతే అంటూ గొప్పలు చెప్పుకోవడం, ఏదైనా తప్పుజరిగితే అది ప్రత్యర్ధుల వల్లే అనే లౌక్యం ప్రదర్శించడం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన విశాఖ మెడ్ జోన్ జోన్ ను వైసీపీ సర్కారు సరిగ్గా వాడుకోవడం లేదని అదే పనిగా విమర్శించిన టీడీపీ... ఆ తర్వాత కరోనా కిట్లు ప్రారంభమయ్యాక అదంతా మా చలవే అని చెప్పుకుంది. అదే సమయంలో మడ్ టెక్ జోన్ లో అక్రమాల పేరుతో గగ్గోలు పెట్టిన విపక్ష వైసీపీ .. తాము అధికారంలోకి వచ్చాక కిట్లు ఉత్పత్తి ప్రారంభించే సరికి తమ ఘనతే అని చాటింపు వేసుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే...
మెడ్ టెక్ జోన్ లో కరోనా కిట్లు...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో వైద్య పరికరాల ఉత్పత్తి పరిశ్రమల సముదాయంగా మెడ్ టెక్ జోన్ ప్రారంభమైంది. పేరుకు ప్రారంభమైంది కానీ టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే వరకూ అందులో నుంచి పూచిక పుల్ల కూడా బయటికి రాలేదు. అయినా మెడ్ టెక్ జోన్లో కుంభకోణాలు జరిగిపోయాయంటూ అప్పట్లో విపక్ష వైసీపీ ఆరోపణలు చేసేది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టిసారించింది లేదు. కానీ టీడీపీ మాత్రం మెడ్ టెక్ జోన్లో అక్రమాలు జరిగాయని, విచారణ జరిపించాలని డిమాండ్లు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో మెడ్ టెక్ జోన్లో కరోనా కిట్ల తయారీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
మెడ్ టెక్ ఘనత మాదంటే మాదే...
కరోనా వైరస్ ప్రభావం మొదలు కాగానే విశాఖలోని మెడ్ టెక్ జోన్ ను ప్రభుత్వం వాడుకోవడం లేదంటూ నానాయాగీ చేసిన టీడీపీ నేతలు.. అక్కడి నుంచి కిట్ల ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని చెప్పగానే టోన్ మార్చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ముందుచూపుతో ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ ఇప్పుడు కరోనా సమయంలో ఫలితాలు అందిస్తోందని గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది. అయితే ఇందులో వైసీపీ కూడా తక్కువేమీ తినలేదు. కరోనా కిట్ల తయారీ ద్వారా చంద్రబాబు మూలనపడేసిన మెడ్ టెక్ జోన్ కు ప్రాణం పోశామని చెప్పుకోవడం ప్రారంభించింది.
అసలు కరోనా కిట్లు వచ్చాయా ?
కరోనా కిట్ల తయారీకి మెడ్ టెక్ సిద్ధం కాగానే.. ఈ ఘనతను సొంతం చేసుకోవడానికి వైసీపీ, టీడీపీ నానా కష్టాలు పడుతుండగానే.. ఓ చేదువార్త అందింది. కరోనా లాక్ డౌన్ కారణంగా కిట్ల తయారీకి అవసరమైన విడి భాగాలు, ముడి పదార్దాలు బ్రిటన్ నుంచి రావడం లేదనే వార్త అందింది. అంతే అందరూ గప్ చుప్. అప్పటి వరకూ కరోనా కిట్లు తయారు చేసే పరిశ్రమ తామే నెలకొల్పామని టీడీపీ, తమ హయాంలో మెడ్ టెక్ జోన్ ఉత్పత్తి ప్రారంభించిందని చెప్పిన వైసీపీ.. బ్రిటన్ వార్తతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. దీంతో ఏప్రిల్ చివరి నాటికి లక్షల కిట్లు ఉత్పత్తి చేస్తామని చెప్పిన మెడ్ టెక్ తో పాటు రాజకీయ పార్టీలన్నీ మౌనం వహించాయి.