వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ .. జగన్ స్పందిస్తారా ? పవన్ అన్నంత పని చేస్తారా ?
విశాఖ వేదికగా రాష్ట్రంలో ఇసుక కొరతతో ఇబ్బందిపడుతున్న నిర్మాణ కార్మికుల సమస్య పరిష్కారం కోసం జనసేనాని లాంగ్ మార్చ్ పేరుతో సమర శంఖం పూరించారు. ఏపీలో ఇసుక కొరతపై తన నిరసన తెలియజేస్తూ, భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంతే కాదు రెండు వారాలు గడువిచ్చి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. రెండు వారాల్లో సమస్య పరిష్కారం చెయ్యకుంటే ఎవరు అడ్డుపడినా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు .

లాంగ్ మార్చ్ ను సక్సెస్ చేసి చూపించిన జనసైన్యం
పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ఏమేరకు సక్సెస్ అవుతుంది అని అనుమానాలు వ్యక్తం చేసిన వారందరికీ జనసేన పార్టీ పిలుపుమేరకు లాంగ్ మార్చ్ లో పాల్గొన్న జనసైనికులు సమాధానం చెప్పారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం పవన్ కళ్యాణ్ తో పాటుగా లాంగ్ మార్చ్ లో పాల్గొని నిర్మాణ రంగ కార్మికులను కాపాడాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతమైనది. పవన్ కళ్యాణ్తో పాటు పలువురు విపక్ష పార్టీల నేతలు సైతం ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు.

జగన్ కు రెండు వారాల డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం
లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్పై జనసేనాని నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేక ఇప్పటివరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు రోడ్డున పడడానికి ప్రభుత్వమే కారణమని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం జగన్కు రెండు వారాల డెడ్ లైన్ విధించారు పవన్ కళ్యాణ్.

నిర్మాణరంగ కార్మికులను ఆదుకోవాలని పవన్ డిమాండ్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రెండు వారాల్లోగా భవన కార్మికులు ఒక్కొక్కరికి రూ.50 వేలు పరిహారం కింద ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఇసుక కొరత తీర్చడానికి, నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఇక డెడ్లైన్ లోపు ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడిచి నిరసన వ్యక్తం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

కూల్చివేతలతో మొదలు పెట్టిన ప్రభుత్వం కూలిపోతుందన్న పవన్
నిర్మాణరంగ కార్మికుల కోసం తాము చేసే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, పోలీసులను పెట్టుకున్నా, ఆర్మీని పిలిపించుకున్నా, ఎవరు ఆపుతారో చూస్తామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఇక అంతే కాదు ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన పాలనను కూల్చివేతలతో మొదలు పెట్టిందని ఇక ప్రస్తుతం తాజా పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. అటు విజయసాయిరెడ్డిపై కూడా విమర్శలు చేసిన పవన్ పరిధి దాటితే తాట తీస్తానంటూ ఘాటుగా మాట్లాడారు.

సమస్య పరిష్కరించకుంటే భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామన్న జనసేనాని
తమ డిమాండ్లను రెండు వారాల్లో పూర్తి చేయకపోతే.. తమ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తామన్నారు పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అటు తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల కోసం విపక్షాలన్నీ ఒకతాటి మీదకు వచ్చాయని పవన్ తెలిపారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల కోసం కూడా అఖిలపక్షం కదిలిరావాలని సూచించారు.
జనసేనాని విధించిన డెడ్లైన్కు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా? భవన నిర్మాణ కార్మికులకు పవన్ డిమాండ్ చేసినట్టు 50 వేల రూపాయల పరిహారం చెల్లించి, మరణించిన కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తారా ? అన్నది ఇప్పుడు ఏపీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

జగన్ స్పందిస్తారా ? పవన్ చేసిన డిమాండ్స్ కు తలొగ్గుతారా !!
ఇక అన్నిటికంటే ఇసుక కొరతను నివారించడానికి, నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించడానికి జగన్ ఏం చేయబోతున్నారు? ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినప్పటికీ తాజా పరిస్థితులు ఇసుక కొరతను నివారించడానికి అనుకూలంగా లేనట్టుగా కనబడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో లాంగ్ మార్చ్ చేసిన పవన్ హెచ్చరికలు జగన్ పట్టించుకుంటారా? నిర్మాణ రంగ కార్మికుల సమస్య కు పరిష్కారం చూపిస్తారా ? లేదా పవన్ కళ్యాణ్ అమరావతి విధుల్లో నడచి ప్రభుత్వ అసమర్థతను మరోసారి ఎండగట్టి అన్నంతపని చేస్తారా!! అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications