ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్రనైట్ మైనింగ్ జరుగుతోంది. అయితే దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు ఆదివాసీలతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం రాగానే ఆదివాసీల వేదన విని వెంటనే మైనింగ్ ఆపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మైనింగ్ కళ్యాణలోవ డ్యామ్కు అతిసమీపంలో జరుగుతుండటంతో రిజర్వాయర్లో నీళ్లు అడుగుంటిపోతున్నాయి. దీంతో చుట్టుపక్కల గిరిజన ప్రాంతాలకు నీటి సమస్య తలెత్తుతోంది. అంతేకాదు మైనింగ్ చేయడం వల్ల డ్యామ్ దాదాపు ఎండిపోయే స్థితికి చేరుకుంది. ఇక సాగుకు కూడా నీరుఅందని పరిస్థితి నెలకొంది. ఇక మైనింగ్ కోసం అనుమతులు ప్రయత్నించిన ఆయా కంపెనీలకు అనుమతులు లభించలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. జలవనరుల శాఖ మైనింగ్కు అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు. ఇక క్వారీలు లీజు తీసుకునేందుకు కూడా అనుమతులు లేవని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు.
కళ్యాణలోవ రిజర్వాయర్ ఆయకట్టుకింద 4,484 ఎకరాలు సాగు అవుతోందని అధికారులు తెలిపారు. ఇక మైనింగ్ వల్ల తమ పంటలకు నీరు అందడం లేదని అనుమతులు రద్దు చేయాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో దీన్ని నాన్ మైనింగ్ జోన్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇక రిజర్వాయర్ చుట్టూ ఉన్న జోగంపేట, రుచుపొందుకు, అజేయపురంలాంటి గ్రామాల్లో ఇప్పటికీ క్రియాశీలకంగా ఉండే క్వారీలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ పలు కంపెనీలు వాలి క్వారీలను పెద్ద పెద్ద డైనమైట్లతో పేల్చే ప్రయత్నం చేస్తున్నాయని దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నట్లు అధికారుల దృష్టికి స్థానిక గిరిజనులు తీసుకొచ్చారు.
1978లో కళ్యాణపులోవ రిజర్వాయర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది.దీన్ని వరాహ నదిపై నిర్మించిన ఈ నది సాగునీరు అవసరాలను తీర్చేది.ఇక దాదాపు 10వేల ఎకరాలకు నీరు అందిస్తోంది ఈ రిజర్వాయర్.అంతేకాదు గిరిజన గ్రామాలకు తాగునీరును కూడా అందిస్తోంది.ఇక మైనింగ్ కోసం వచ్చిన పలు కంపెనీలు రిజర్వాయర్లోకి నీరు వచ్చే కాలువలను మూసివేశారని గిరిజనులు చెబుతున్నారు. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ రోడ్లు వేస్తే మైనింగ్ కంపెనీలు సామగ్రిని తరలించేందుకు భారీ వాహనాలు వినియోగించాయని దీంతో రహదారులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.