ఆగని లిక్కర్ అక్రమ రవాణా... విశాఖపట్నంలో 1702 మద్యం సీసాలు సీజ్ చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం రవాణాకు తెరపడట్లేదు. ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాక పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా పెరిగింది. రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సప్లై చేస్తున్న ముఠాలు పెరిగిపోయాయి.తాజాగా విశాఖపట్నంలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది.
తవుడు బస్తాల మాటున తరలిస్తున్న అక్రమ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితులను ఒడిశాకు చెందిన సంతోష్ కుమార్ పండా, సదాశివ,విశాఖపట్నంకు చెందిన మత్తల గిరిగా గుర్తించారు.

తవుడు సంచులైతే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుందన్న ఉద్దేశంతో అందులో మద్యం సీసాలను నింపి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖకు చెందిన మొగిలి అజయ్,కిరణ్ సాగర్,తిరుపతి అనే వ్యక్తులు ఈ మద్యాన్ని విక్రయించేందుకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 1702 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ ఏపీలో అక్రమ మద్యం రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో పొరుగు రాష్ట్రాల్లో మద్యాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న ముఠాలు అక్రమంగా రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్, కాట్రపాడు ప్రాంతాల్లో భారీ ఎత్తున మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 100 ఫుల్ బాటిళ్లు,మరో 750 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకే కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇలా మద్యం అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications