ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లడానికి వీలుగా వైజాగ్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నిర్వహించ తలపెట్టిన విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ముందుగా నిర్దేశించుకున్నషెడ్యూల్ ప్రకారం- విశాఖపట్నంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాల్సి ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి లోక్ సభ సభ్యుల నివాసాల్లో జరిగే వివాహ వేడకలకు వెళ్లాల్సి ఉంది.
శారదాపీఠం వార్షికోత్సవంలో..
శనివారం ఉదయం 9:15 నిమిషాలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారు. విశాఖ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తరువాత అక్కడి నుంచి నేరుగా చినముషిడివాడకు వెళ్తారు. శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. రాజశ్యామల యాగానికి హాజరవుతారు.
వివాహ వేడుకల్లో..
వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటారు. అనకాపల్లికి చెందిన వైఎస్ఆర్సీపీ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ వెంకట సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీలా స్రవంతి వివాహ రిసెప్షన్ కు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్తారు.
షెడ్యూల్ రద్దు?
ఆయన కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతారు. ఆ తరువాత ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణమౌతారు. ఇది ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్. ఈ షెడ్యూల్ కాస్తా రద్దయినట్లు సమాచారం అందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉన్నందున- ఢిల్లీ వెళ్లడానికి వీలుగా విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఢిల్లీ పర్యటన కోసం..
నిజానికి- ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దీనికోసం ఆయన గుంటూరు జిల్లాలోని పొన్నూరు పర్యటన, హైదరాబాద్ పర్యటనలను రద్దు చేసుకున్నారు. పొన్నూరులో పార్టీ నాయకురాలు రూత్ రాణి ఇంట వివాహ వేడుకల్లో జగన్ పాల్గొనాల్సి ఉంది. హైదరాబాద్ లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహానికి కూడా వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ వెళ్లాల్సి రావడం వల్ల ఈ రెండింటినీ జగన్ రద్దు చేసుకున్నారు.
అపాయింట్మెంట్ ఖరారు?
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున కేంద్రంలోఅధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని, అందువల్ల అపాయింట్ మెంట్ దొరకలేదనే ఉద్దేశంతో ఢిల్లీ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దాని స్థానంలో విశాఖ పర్యటనను షెడ్యూల్ చేసుకున్నారు. తాజాగా- ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఖరారయ్యే అవకాశం ఉన్నందున విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.