విశాఖ హత్యలు: విస్తుపోయే విషయాలు.. కుమార్తెపై అత్యాచార ఘటనే అతనిలో ప్రతీకారం పెంచిందా?
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురవడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జుత్తాడకే చెందిన అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పొద్దు పొద్దున.. అప్పుడే నిద్ర లేచిన ఆ కుటుంబ సభ్యులందరినీ అప్పలరాజు అత్యంత పాశవికంగా హతమార్చాడు. నెలల వయసున్న పసికందును కూడా కత్తితో నరికేశాడు. పాత కక్షలు,ప్రతీకారమే ఈ హత్యలకు కారణంగా తెలుస్తోంది. గతంలో తన కుమార్తెకు జరిగిన అన్యాయమే అప్పలరాజులో పగను పెంచినట్లుగా సమాచారం.
అప్పలరాజు కుమార్తెపై అత్యాచారం..!
జుత్తాడకు చెందిన బమ్మిడి రమణ(53),అదే గ్రామానికి చెందిన అప్పలరాజు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వైరం కొనసాగుతోంది. అప్పలరాజు కుమార్తెపై రమణ కుమారుడు విజయ్ కిరణ్ అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలే ఈ వైరానికి కారణం. ఇదే అభియోగంతో ఏప్రిల్,2018లో విజయ్ కిరణ్పై కేసు నమోదైంది. అప్పలరాజు కుమార్తెను ఇంటికి పిలిచి టీ,కాఫీ,కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి ఇచ్చి... పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా విజయ్ కిరణ్పై ఆరోపణలున్నాయి. అలా 8 నెలలు ఆమెను వేధించాడన్న ఆరోపణలున్నాయి.
డబ్బులు డిమాండ్ చేస్తున్నారని...
అంతేకాదు,ఆమెపై లైంగిక దాడి సమయంలో చిత్రీకరించిన ఫోటోలతో విజయ్ కిరణ్ భార్య ఉషా రాణి తమ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని అప్పట్లో అప్పలరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో నలుగురు వ్యక్తులతో కలిసి తమపై ఆమె బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఇదే క్రమంలో విజయ్ కిరణ్ భార్య ఉషా రాణి కూడా పెందుర్తి పోలీస్ స్టేషన్లో అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు.
తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని... తన భర్త విజయ్ కిరణ్ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటినుంచి విజయ్ కిరణ్ కుటుంబంపై అప్పలరాజు పగతో రగిలిపోతున్నాడు. తన కుమార్తెకు అన్యాయం చేసినవాడిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు.
ఇలా హత్యలు...
గురువారం(ఏప్రిల్ 15) తెల్లవారుజామున పశువుల పాలు పితికేందుకు అప్పలరాజు నిద్రలేచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రమణ ఇంటివైపు కన్నేశాడు. విజయవాడలో ఉంటున్న రమణ కుటుంబ సభ్యులు విజయ్ కిరణ్ ఇంటికి వచ్చినట్లు గుర్తించాడు. ఆ వెంటనే చేతిలో కత్తి పట్టుకుని ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు. ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న విజయ్ కిరణ్ భార్య ఉషా రాణి(30)పై మొదట దాడి చేశాడు. ఆమె మెడపై నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. ఆపై ఇంట్లోకి వెళ్లి విజయ్ కిరణ్ తండ్రి రమణ,అతని మేనత్తలు రమాదేవి,అరుణ, పిల్లలు ఉదయ్(4),కుమార్తె లిషిత(6 నెలలు)ను దారుణంగా హతమార్చాడు.
స్వయంగా లొంగిపోయాడు...
హత్యలకు పాల్పడిన తర్వాత.. అప్పలరాజు అదే ఇంటి అరుగుపై కాసేపు కూర్చొన్నాడు. ఆపై 100 నంబర్కు తానే ఫోన్ చేసి హత్యల గురించి చెప్పాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బాధిత కుటుంబం జుత్తాడ గ్రామ శివారులో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో హత్య జరిగిన విషయం నిందితుడే ఫోన్ చేసి చెప్పేంతవరకూ పోలీసులకు తెలియలేదు. ఈ హత్యలు జరిగినప్పుడు విజయ్ కిరణ్ విజయవాడలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.