Advance Monsoon: నో వెయిటింగ్: తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్
విశాఖఫట్టణం: రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ తీపికబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా దేశంలో ప్రవేశించబోతోన్నాయి. ఏకంగా అయిదు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకాబోతోన్నాయి. శనివారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా ఇవి విస్తరిస్తాయని వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 2వ తేదీ నాటికి కేరళలో ప్రవేశిస్తాయని తెలిపింది.
ఈ నెల చివరివారంలోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలో ప్రవేశించడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయిని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అనంతరం ఇవి చురుగ్గా కదులుతాయని, నిర్దేశిత గడువు కంటే ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఫలితంగా- కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కేరళకు ఆనుకుని ఉన్న కర్ణాటక, మాహె, లక్షద్వీప్లపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని, ఈ నెల 27వ తేదీ తరువాత ఆ నాలుగు చోట్లా భారీ వర్షల పడటానికి అవకాశాలు లేకపోలేదని తెలిపారు.
ఆ తరువాతి వారంలో ఏపీ, తెలంగాణల్లో రుతు పవనాల ప్రభావం కనిపిస్తుందని అంచనా వేశారు. వాటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉంటాయని, దానికి అనుకూల వాతారణం ఉందని తెలిపారు. దీనితోపాటు- 21, 22 తేదీల్లో కర్ణాటక, కేరళ, మాహె కోస్తా తీర ప్రాంతాలు, దక్షిణ అంతర్గత ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వాటి ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఉంటుందని అన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Recommended Video
అదే సమయంలో- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అండమాన్ ఉత్తర సముద్ర ప్రాంతాన్ని ఆనుకుని వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ నెల 24వ తేదీ నాటికి తుఫాన్గా మారుతుందని చెప్పారు. దీనికి యాస్ తుఫాన్(Cyclone Yaas)గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఈ నెల 26న తీరాన్ని చేరుతుందని వాతావరణ కేంద్రం వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.