కక్ష సాధింపులకు దిగితే సహించం .. ఏపీ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.జగన్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి . మాతృ భాషలోనే బోధన ఉండి తీరాలన్నారు.
112 అత్యవసర నంబర్ త్వరలో దేశవ్యాప్తంగా అమలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఇక అంతే కాదు ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, బిజెపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడిన ఘటనలపై పలు ఫిర్యాదులు అందాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి కక్షసాధింపు ధోరణి మంచిది కాదని ఆయన హితవు పలికారు. విశాఖలో పర్యటించిన కిషన్ రెడ్డి వైసీపీ సర్కార్ కక్ష సాధింపు ధోరణికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఏపీలో అన్యమత ప్రచారం బాగా జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మత మార్పిడులు మంచిది కాదు అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సర్కార్ తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రభుత్వంలా వ్యవహరించాలి తప్ప కక్షపూరిత చర్యలతో వ్యవహరించడం మంచి సాంప్రదాయం కాబోదని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు విశాఖ లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీచ్ వద్ద ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు .స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతిఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.