రాజధానిగా అమరావతిపై టాలీవుడ్ - జబర్దస్త్ నిర్ణయం..!!
విశాఖపట్నం: రాష్ట్రంలో అమరావతి-మూడు రాజధానుల డిమాండ్ పతాక స్థాయికి చేరుకుంది. పోటాపోటీ ఉద్యమాలు సాగుతున్నాయి. అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే ప్రాంతంలో దీనిపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలు తమ గళాన్ని వినిపిస్తోన్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశాలు దీనికి నిదర్శనం.

రౌండ్ టేబుల్స్ భేటీలతో..
ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో ఏర్పాటైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు, మేధావులు, విద్యావేత్త, సామాజికవేత్తలు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉందనే విషయాన్ని తేల్చి చెప్పారు. ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండటానికి మూడు రాజధానులను నెలకొల్పాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలంటూ డిమాండ్ చేశారు.

విశాఖ గర్జన..
ఇదే డిమాండ్తో శనివారం విశాఖ గర్జన ఆందోళనను చేపట్టనుంది జేఏసీ. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, దీనికి మద్దతుగా ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు తెలిపింది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించడానికి తాము స్వాగతిస్తోన్నామని, దీన్ని వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది. విశాఖలోని ఎల్ఐసీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద 15వ తేదీ ఉదయం 10 ర్యాలీ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది.

టాలీవుడ్ నుంచీ మద్దతు..
అమరావతికి వ్యతిరేకంగా.. మూడు రాజధానులకు అనుకూలంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచీ మద్దతు లభిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటులు, కళాకారులు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలు, డిమాండ్లను వ్యక్తం చేస్తూ వస్తోన్నారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మెజారిటీ నటులు, కళాకారులు మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారు. విశఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేయాలంటూ నినదిస్తోన్నారు.
విశాఖపట్నం అంటే ఇష్టపడని తెలుగువారుంటారా?
ఈ క్రమంలో తాజాగా నటులు జోగి నాయుడు, జబర్దస్త్ అప్పారావు స్పందించారు. ఓ సెల్ఫీ వీడియోను ఆయన విడుదల చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖపట్నాన్ని ఇష్టపడని తెలుగువారు ఎవరూ ఉండరని, అదే విశాఖ రాజధానిగా మారితే బాగుంటుందని చెప్పారు. ఈ నగరాన్ని రాజధానిగా చేస్తే- వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని జోగి నాయుడు, అప్పారావు పేర్కొన్నారు.
గర్జనలో పాల్గొనాలి..
శనివారం జేఏసీ నిర్వహించబోయే విశాఖ గర్జనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జోగి నాయుడు, అప్పారావు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నటుడిగా తాను విశాఖ రాజధానిని స్వాగతిస్తోన్నానని అన్నారు. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని, ఉత్తరాంధ్రలోని ఈ అతిపెద్ద నగరానికి రాజధాని వచ్చి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన విశాఖను మన రాజధానిగా చేయాలని పేర్కొన్నారు. ఈ ఉద్యమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications