జోరువానలోనే విశాఖ ర్యాలీ-పోరు ఉధృతానికి మంత్రులపిలుపు..కొడాలి తీవ్ర వ్యాఖ్యలు
ఏపీలో మూడు రాజధానులకు అనుకూలంగా నాన్-పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు ఇవాళ విశాఖలో నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమైంది. భారీ వర్షం కురుస్తున్నా వైసీపీ నేతలు, మంత్రులు తడుస్తూనే ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రులు, మాజీ మంత్రులు మూడు రాజధానులపై రాజకీయ పోరును ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ సహా విపక్ష నేతలపై మండిపడ్డారు.
భారీ వర్షంలోనే విశాఖ గర్జన
మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో ఇవాళ నిర్వహించిన గర్జన ర్యాలీకి జనం భారీగా తరలివచ్చారు. వైసీపీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు అంతా ర్యాలీకి తరలిరావడంతో విశాఖ జనసంద్రమైంది. జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా ర్యాలీలో జనం పాల్గొన్నారు. మంత్రులు సైతం గొడుగులు కూడా పట్టుకోకుండానే వర్షంలో తడుస్తూ ర్యాలీలో నడిచారు. మూడు రాజధానుల ఆకాంక్షను చాటేందుకు నిర్వహించిన ర్యాలీలో వికేంద్రీకరణ నినాదాలు మిన్నంటాయి.
రాజకీయ పోరుకు సిద్ధం కావాలన్న ధర్మాన
విశాఖ గర్జన ర్యాలీ ముగిసిన వైఎస్సార్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై భారీ బహిరంగసభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరనేది అమరావతికి వినిపించాలని ధర్మాన కోరారు. రాజకీయ పోరాటానికైనా సిద్దం కావాలని సభకు హాజరైన వారిని ఉద్దేశించి ధర్మాన పిలుపునిచ్చారు. భారీవర్షంలోనే ఇంత భారీ ర్యాలీ జరిగిందంటే ఈ ప్రాంతంలో రాజధాని ఆకాంక్ష ఎలా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. ఉత్తరాంధ్రకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసినందుకు నిరసనగా రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ధర్మాన తెలిపారు. ఇందుకు అందరూ సన్నద్ధం కావాలన్నారు.
ఉత్తరాంధ్రకు రాజధాని అవసరమన్న మేరుగు
ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో గర్జన ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజలకు మంత్రి మేరుగు నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని దోచుకుని, 29 గ్రామాల రైతుల్నిమోసంచేసి ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నారని టీడీపీపై మంత్రి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మూడు రాజధానులు అవసరమన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాజధాని అభివృద్ధి చేయలేకపోయారని నాగార్జున ప్రశ్నించారు. అందరూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు.
నిప్పులు చెరిగిన కొడాలి నాని
రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని, భవిష్యత్తులో వేర్పాటు ఉద్యమాలు రాకుండా ఉండాలంటే మూడు రాజధానులు అవసరమని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. విశాఖ,కర్నూల్లోనూ రాజకీయాలు చేస్తున్న టీడీపీ, సినిమాలు విడుదల చేసుకుంటున్న పవన్ కళ్యాణ్, వ్యాపారాలు చేసుకుంటున్న రామోజీరావు ఇక్కడ రాజధానిని మాత్రం వ్యతిరేకిస్తున్నారని కొడాలి ఆరోపించారు.
గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు వందలాది ఎకరాలు అమరావతిలో కొన్నారని, అందుకే ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారన్నారు. చంద్రబాబు 420 అని, పిల్లనిచ్చి, పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్ ను పదవి కోసం పార్టీ నుంచే గెంటేసిన నాయకుడని కొడాలి విమర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ చంద్రబాబు వేధించారన్నారు. చంద్రబాబుకు ప్రేమ, దయాదాక్షిణ్యాలు ఉండవన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మీద ఆయనకెలాంటి ప్రేమ లేదన్నారు. ఉత్తరాంధ్ర నాశనం కోసం అమరావతి రైతుల పేరుతో పంపారన్నారు. ఉత్తరాంధ్రలో ఎల్లో మీడియా టీవీలు, పేపర్లు, టీడీపీ, జనసేనను బ్యాన్ చేయాలని కొడాలి పిలుపునిచ్చారు.
మరో సాయుధ పోరాటం అవసరమన్న తమ్మినేని
ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో ఉద్యమాలు వచ్చాయని స్పీకర్ తమ్మినేని తెలిపారు. మందస సాయుధ పోరాటం కూడా ఏ స్ధాయిలో జరిగిందో అందరికీ తెలుసన్నారు. తామున్నా లేకపోయినా భవితరాలకు న్యాయం జరగాలనే ఆ ఉద్యమాలు చేశారన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా మరో ప్రత్యేక ఉద్యమం రాకూడదన్న ఆశయంతోనే మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తెలిపారు.
ఈ నిర్ణయాన్ని కాదని ఉత్తరాంధ్రలో మాట్లాడుతున్న రాజకీయ పార్టీల్ని నిలదీయాలని తమ్మినేని పిలుపునిచ్చారు. గొప్ప మానవతావాది అయిన సీఎం జగన్ నిష్పాక్షికంగా తీసుకున్న ఈ నిర్ణయానికి అండగా నిలవాలన్నారు.
పవన్ పై మంత్రి రోజా సెటైర్లు
మేం కేంద్రంలో చక్రం తిప్పామని చెప్పుకునే సైకిల్ చక్రాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాయని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు చేసిన వెధవ పనుల వల్ల, అత్యాశతో దోచుకుని దాచుకోవడం వల్ల మిగతా ప్రాంతాలు అన్యాయం అయిపోయాయని రోజా తెలిపారు. హైదరాబాద్ తరహాలో ఇక్కడా చేస్తే మూడు ప్రాంతాలు అన్యాయం కాకుండా పోతాయని మూడు రాజధానుల్ని తెస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ కు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలని, సినిమా షూటింగ్స్ కు వైజాగ్ కావాలని కానీ రాజధాని మాత్రం వద్దన్నారు. గాజువాకలో పవన్ ను ఓడించి మంచిపని చేశారన్నారు.
ఉత్తరాంధ్ర తొడకొడితే పవన్ కళ్యాణ్ కు అంతేనన్నారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, అమరావతిని కూడా అభివృద్ధి చేయమంటే కేవలం అమరావతే కావాలంటున్నారన్నారు. బ్రతుకు కోసం బాధ్యతగా తాము పోరాటంచేస్తుంటే వారు రియల్ ఎస్టేట్ కోసం పోరాటం చేస్తున్నారన్నారు.