విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కన్నేసిన వైఎస్ జగన్: ప్రైవేటీకరణను అడ్డుకునేలా రెండంచెల మాస్టర్ ప్లాన్
విశాఖపట్నం: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యమ తరహా వాతావరణం నెలకొంది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించడం, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆ అంశాన్ని చేర్చడం వంటి కీలక చర్యల అనంతరం విశాఖపట్నం ఎరుపెక్కింది. వామపక్ష కార్మిక సంఘాలు మహోద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయి.
రాష్ట్రం కొనుగోలు చేసేలా..
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం.. విశాఖ ఉక్కు కర్మాగారంపై కన్నేసింది. రాష్ట్రం నుంచి వెల్లువెత్తుతోన్న నిరసనలు, వ్యతిరేకతలను పట్టించుకోకుండా.. మోడీ సర్కార్ ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపితే..విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనుగోలు చేయడానికి సిద్ధ పడనుంది. దీనికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనబోతోంది. దీనికి సంబంధించిన సాధ్యసాధ్యాలపై జగన్ సర్కార్ అధ్యయనం కూడా మొదలు పెట్టేసింది. విశాఖ ఉక్కును రాస్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని రావడానికి రాజకీయపరమైన ఒత్తిళ్లను కూడా మోడీ సర్కార్పై తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్టు చెబుతున్నారు.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించే సమయంలో రూపొందించిన పునర్విభజన చట్టం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక స్టీల్ ఫ్యాక్టరీని కేటాయించాల్సి ఉంది. ఏడేళ్ల తరువాత కూడా దాని ఊసును ఎత్తట్లేదు మోడీ సర్కార్. తాజాగా ఇప్పటికే ఉన్నవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడానికి సన్నాహాలు చేపట్టింది. పునర్విభజన చట్టం ప్రకారం ఇస్తామని హామీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్.. కేటాయించే పరిస్థితుల్లో మోడీ సర్కార్ లేదనేది స్పష్టమౌతోంది. ఈ పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను విక్రయించడం కంటే.. దాన్నే రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేలా మరో వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు అంశాలపై కేంద్రంపై ఒత్తిడి..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఈ రెండు అంశాల ద్వారా మోడీ సర్కార్పై అన్ని రకాల ఒత్తిళ్లను తీసుకుని రావాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే- వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. విశాఖ ఉక్కు ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు, ఉద్యమాల గురించి అందులో ప్రస్తావించారు. ఆ ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకుని రావడానికి అవసరమైన కొన్ని సూచనలు చేశారు. దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మారుతున్న రాజకీయాలు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు రాజీనామా సైతం చేశారు. స్టీల్ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఓ ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారయన. ఈ జేఏసీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడిగా ఒత్తిళ్లను తీసుకుని రావాలని భావిస్తున్నారు.