పాత మిత్రుల్ని కలిపిన స్టీల్ ప్లాంట్ ఉద్యమం- ఒకే వేదికపై గంటా, అవంతి శ్రీనివాస్
ఒకప్పుడు విశాఖ జిల్లా రాజకీయాల్ని శాసించిన పాత మిత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ ఒకే వేదికపైకి వచ్చారు. పాత విభేదాలను మర్చిపోయి ఒకరినొకరు పలకరించుకున్నారు. నిన్న మొన్నటి వరకూ పరస్పరం కత్తులు దూసుకున్న వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటమే. కార్మికులు సాగిస్తున్న స్టీల్ ప్లాంట్ పోరాటంలో వీరిద్దరూ ఒకే చోట దర్శనమివ్వడం విశాఖలో భవిష్యత్ రాజకీయాలకు కూడా కారణమవుతుందా అన్న చర్చ సాగుతోంది.

గంటా, అవంతిని కలిపిన విశాఖ స్టీల్ ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో సాగుతున్న భారీ ఉద్యమం రాజకీయాల్లో పాత మిత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్లను తిరిగి ఒక్క చోటికి చేర్చింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సాగిస్తున్న నిరసనల వేదికపై గంటా, అవంతి చాలా కాలం తర్వాత దర్శనమిచ్చారు. సీపీఐ నారాయణ వీరిద్దరి చేతులు పట్టుకుని కాసేపు హంగామా చేశారు. దీంతో పాత మిత్రుల్ని విశాఖ స్టీల్ ఉద్యమం కలిపిందా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్కు మద్దతుగా గంటా రాజీనామా చేస్తే అటు అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ తరఫున ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

గంటా, అవంతి స్నేహం
విశాఖ రాజకీయాల్లో ఒకప్పుడు ఉమ్మడిగా చక్రం తిప్పిన చరిత్ర గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ది. 2019 ఎన్నికలకు ముందు ఇద్దరూ ప్రతీసారీ ఒకే పార్టీలో ఉండేవారు. ఎన్నికలను కూడా ఉమ్మడి వ్యూహాలతోనే ఎదుర్కొనేవారు. గంటా గురువుగా అవంతి శిష్యుడిగా సాగిన రాజకీయం ప్రత్యర్ధులకు వణుకు పుట్టించే స్ధాయిలో ఉండేది. గంటా గ్రూపులో కీలక నేతగా ఎదిగిన అవంతి శ్రీనివాస్ ఆయన మాటను కూడా ఎప్పుడూ జవదాటేవారు కాదు. అంతెందుకు 2019 ఎన్నికల్లో గంటాను కాదని అవంతి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారనే వార్తల్ని కూడా ఎవరూ నమ్మలేదు. కుటుంబాల పరంగా కూడా వీరిద్దరూ జాన్ జిగిరీ దోస్తులే.

2019 ఎన్నికల్లో కత్తులు దూసుకున్న గంటా, అవంతి
2019 ఎన్నికలకు ముందు మాత్రం ఎందుకో గంటా శ్రీనివాస్ నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదగాలని భావించారో లేక వైసీపీలోకి వచ్చేందుకు గంటా నిరాకరించారో తెలియదు కానీ ఈ ప్రాణమిత్రులు విడిపోయారు. అంతవరకూ బాగానే ఉన్నా ఎన్నికల రణక్షేత్రంలో పరస్పరం కత్తులు దూసుకున్నారు. విశాఖలో భూకబ్జాల వెనుక గంటా శ్రీనివాస్ ఉన్నారనే వరకూ అవంతి విమర్శలు వెళ్ళాయంటే వీరిద్దరి మధ్య రాజకీయంగా ఎంత గ్యాప్ వచ్చిందో అర్దం చేసుకోవచ్చు. ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ వైసీపీ సర్కారులో మంత్రి అయితే, గంటా మాత్రం విశాఖ నార్త్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి సైలెంట్ అయిపోయారు.

వైసీపీలోకి గంటా రాకను వ్యతిరేకించిన అవంతి
ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ ఒకరి గురించి ఒకరు బహిరంగంగా మాట్లాడుకుంది లేదు. అయితే వైసీపీలో గంటా రాకను మాత్రం అవంతి వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం మాత్రం ఇప్పటికీ బలంగా సాగుతోంది. గంటా వంటి బలమైన నేత వైసీపీలో చేరితే విశాఖలో తన ప్రాభవానికి ఎక్కడ గండిపడుతుందో అన్న భయం అవంతిలో ఉందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో విశాఖ రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి సాయంతో అవంతి.. గంటా రాకను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగింది. దీంతో గంటా వైసీపీలో చేరిపోయినట్లే అనుకున్న రెండు, మూడు సార్లు అనూహ్యంగా చివరి నిమిషంలో బ్రేక్ పడిపోయింది.












Click it and Unblock the Notifications