జాతీయ స్థాయిలో జగన్ పరువు పోయేలా.. వైజాగ్లో రోడ్డెక్కిన మహిళలు.. ఎందుకో తెలుసా?
''కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయి..'', ''ర్యాపిడ్ టెస్టింగ్స్లో అన్ని రాష్ట్రాలకంటే ఏపీనే ముందుంది..'', ''ఏపీలో క్వారంటైన్ ఫెసిలిటీలు, ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు భేష్..'' అంటూ పలు మార్లు కేంద్రం నుంచి సీఎం జగన్ కితాబులందుకున్నారు. కానీ రెండ్రోజులుగా సీన్ రివర్సైంది. ఏ జాతీయ చానెల్ లో చూసినా ఏపీలో వైన్ షాపుల ముందు క్యూలైన్లపైనే చర్చ జరుగుతోంది. స్థూలంగా జాతీయ స్థాయిలోనూ జగన్ పరువుపోయేలా మద్యం అమ్మకాల వ్యవహారం హైలైట్ అయింది. ఈలోపే..

మహిళల ఆగ్రహం..
మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో మద్యం అమ్మకాలను చర్చనీయాంశం చేయడంలో ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సక్సెస్ అయ్యాయి. అందుకు నిదర్శనంగా మంగళవారం కాబోయే రాజధాని విశాఖపట్నంలో మహిళలు భారీ నిరసనకు దిగారు. వైజాగ్ సహా రాష్ట్రమంతటా తెరిచిన వైన్ షాపులను వెంటనే మూసేయాలంటూ వందల మంది మహిళలు రోడ్డెక్కారు. సిటీలోని తోటగరువులో వైన్ షాపుల ముందే నిలబడి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆఖరికి చావులకు కూడా వెళ్లొద్దన్న ప్రభుత్వం.. ఇప్పుడు మద్యం అమ్మకాలకు అనుమతించడమేంటని మండిపడ్డారు.

ఇప్పుడు రాదా కరోనా?
‘‘నిత్యావసర సరుకుల అమ్మకాలకు మూడు గంటలే టైమిచ్చిన ప్రభుత్వం.. మద్యం అమ్మకాలను మాత్రం ఏడు, ఎనిమిది గంటలపాటు సాగిస్తోంది. వైన్ షాపులకు జనం పోటెత్తడంతో భారీ క్యూలైన్లు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. కనీసం ఒక్క షాపు దగ్గర కూడా సామాజిక దూరం పాటించనేలేదు. ఇప్పుడు కరోనా వ్యాపించదా? గుడులు, బడులు మూసేసిన ప్రభుత్వం వైన్ షాపులు మాత్రమే ఎందుకు తెరిచినట్లు?'' అంటూ వైసీపీ సర్కారుపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏపీ వీడియోలు వైరల్..
లాక్ డౌన్ సడలింపులతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆయా గ్రీన్ జోన్ల పరిధిలో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, యూపీలోనూ జనం వైన్ షాపులకు పోటెత్తారు. దేశరాజధానిలో మహిళలు సైతం క్యూలైన్లలో గంటలపాటు నిలబడి మందు కొనుక్కెళ్లారు. అయితే అన్నింటికీ మించి ఏపీలో చోటుచేసుకున్న దృశ్యాల తాలూకు వీడియోలే దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. వాటిని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారా? అన్నది పక్కనపెడితే, మెజార్టీ వైన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై టీడీపీ విమర్శలు గుప్పించగా, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. మద్యం అమ్మకాల సందర్భంగా నిబంధనల్ని అతిక్రమించిన ఓ వైన్ షాపును ఢిల్లీ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని నేతలు గుర్తుచేశారు.

తొలిరోజు ఫిగర్ ఇది..
లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల తర్వాత వైన్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు సంబురాలు చేసుకున్నారు. తొలిరోజు అమ్మకాకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కల్ని విడుదల చేసింది. సోమవారం ఒక్కరోజే మొత్తం రూ.68.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తేలింది. ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. తొలిరోజే అన్నిరకాల మద్యం బ్రాండ్లపై 25శాతం ధర పెంచిన ఏపీ సర్కారు.. మంగళవారం నాటికి మరో 50 శాతం ధర పెంచేసింది. ధరల పెరుగుదలపై మందుబాబులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం.. సంపూర్ణ మద్య నియంత్రణలో భాగంగానే ధరలు పెంచామని వివరణ ఇచ్చింది.












Click it and Unblock the Notifications