ఇదీ డీల్.. అక్కడే తర్ఫీదు.. డా.సుధాకర్ వ్యవహారంపై వైసీపీ సంచలనం.. హైకోర్టులో పిల్..
విశాఖలో అనస్థీషియా డా.సుధాకర్ ఉదంతంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయంగా వైసీపీ-టీడీపీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా.. సోషల్ మీడియాలోనూ దీనిపై ఎడతెగని చర్చ నడుస్తోంది. సుధాకర్ దళితుడు అయినందునే అతనీ దుస్థితిలోకి నెట్టివేయబడ్డాడని పలువురు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అతను టీడీపీ చేత బలిపశువు కాబడ్డాడని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ మాత్రం ఇదంతా వైసీపీ కక్షపూరిత ధోరణికి నిదర్శనమని విమర్శిస్తోంది. ఇలా ఇరు పార్టీల మధ్య డా.సుధాకర్ వ్యవహారం ఆరని చిచ్చులా మారింది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఈ వ్యవహారంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే సీటు ఇస్తామని డీల్..
అయ్యన్నపాత్రుడు తనను కుక్కలా వాడుకున్నాడని డా.సుధాకర్ అంటున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్ పేర్కొన్నారు. అయ్యన్న మాత్రం సుధాకర్తో పెద్దగా పరిచయం లేదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దళితుడైన డా.సుధాకర్కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఎమ్మెల్యే సీటు ఆశ చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

బలిపశువును చేశారని..
తమ రాజకీయం కోసం చంద్రబాబు, అయ్యన్నలు కలిసి దళితుడైన సుధాకర్ను బలి చేశారని ఉమాశంకర్ ఆరోపించారు. వైజాగ్ టీడీపీ కార్యాలయం వేదికగా డా.సుధాకర్తో కలిసి అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపై కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజలకు టీడీపీ ఎక్కడ దూరమవుతుందోనన్న భయంతోనే చంద్రబాబు,అయ్యన్న కలిసి ఈ డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ధోరణి దళితులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడే తర్ఫీదు..
డా.సుధాకర్ వ్యవహారంపై రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ స్పందించారు. సుధాకర్ కులం కార్డుని అడ్డుపెట్టుకొని తప్పుని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై కుట్రకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంట్లోనే డా.సుధాకర్కు తర్ఫీదు ఇచ్చారని ఆరోపించారు.అందుకు తగ్గ ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. తప్ప తాగి రోడ్డున పడి.. అందరిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ సుధాకర్కు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ వత్తాసు పలకడం సిగ్గుచేటు అని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ దళితులకు చేసిందేమీ లేదని.. కానీ సీఎం జగన్ ఏడాది కాలంలోనే దళిత సామాజికవర్గానికి అన్ని విధాలా పెద్ద పీట వేస్తున్నారని అన్నారు.

హైకోర్టులో పిల్..
మరోవైపు డా.సుధాకర్ అరెస్టుపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రైల్వే మాజీ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధనగ్నంగా ఉంచి అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. సుధాకర్ పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications