విషాదం: కరోనా సోకిందనే భయంతో బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య
విజయనగరం: కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం నల్లబెల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే ఆందోళనతో ఓ కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు చేసుకున్నారు. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నల్లబెల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ(62), ఆయన భార్య సత్యవతి(57) విశాఖపట్నం జిల్లా చోడవరంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో భయాందోళనలకు గురైన వీరిద్దరితోపాటు సత్యనారాయణ గుప్తా తల్లి సుబ్బమ్మ(84) గ్రామ శివారు ఆలయ సమీపంలో పురుగుల మందు తాగి, ఆ తర్వాత బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బావిలో దూకి అధ్యాపకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లాలోని పాడేరు సుండ్రుపుట్టులో నివాసం ఉంటున్న ఓ అధ్యాపకుడు అనారోగ్య కారణాలతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పారావు(51) స్థానిక డిగ్రీ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇదే కాలేజీలో 20 ఏళ్లుగా తాత్కాలిక అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట భార్య, పిల్లలతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో నెలరోజులుగా సోదరి ఉంటున్నారు. కాగా, గురువారం ఉదయం 4 గంటలకు బయటకు వచ్చిన ఆయన మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
లారీ ఢీకొట్టడంతో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు మృతి
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున గస్తీలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
విజయవాడ నుంచి వస్తున్న కరోనా వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్టుగా వెళ్లేందుకు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్ఎస్ రెడ్డి ఉండూరు వంతెన వద్ద వాహనంలో వేచి చూస్తుండగా.. వేగంగా వచ్చిన లారీ వారిపైకి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం దెబ్బతింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications