నేరస్తుల బెయిల్ కోసం ఓ లాయర్ గుమస్తా నిర్వాకం; నకిలీ స్టాంపులతో ఫోర్జరీ పత్రాల దందా!!
వరంగల్ రవాణా కార్యాలయం సమీపంలో నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ లు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఘటన మరిచిపోకముందే బెయిల్ కోసం ఫోర్జరీ పత్రాలను, సంతకాలను సృష్టిస్తున్న గ్యాంగ్ ను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ కేసుల్లో నిందితులుగా వున్న సమయంలో వారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావల్సిన పత్రాలను, పూచికత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ను గురువారం టాస్క్ ఫోర్స్ మరియు నుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
బెయిల్ కోసం నకిలీ పత్రాలు, పూచీకత్తు సంతకాలు ఫోర్జరీ గ్యాంగ్ అరెస్ట్
వీరి నుండి పోలీసులు వంచాయితీరాజ్ విభాగానికి చెందిన రబ్బర్ స్టాంప్స్ తో పాటు వంచాయితీ కార్యదర్శి రబ్బర్ స్టాంపులు, నకిలీ ఇంటి విలువ ధ్రువీకరణ పత్రాలు , ఇంటి పన్ను రశీదులు, వివిధ వ్యక్తులకు సంబంధించిన అధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు మూడు సెల్ఫోన్లు, మూడు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణోషి మాట్లాడుతూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ అలియాస్ రాజేష్ మిగతా నలుగురు సభ్యులతో కలిసి ఈ దందా సాగిస్తున్నారని తెలిపారు.
పంచాయితీ రాజ్ విభాగానికి చెందిన నకిలీ రబ్బర్ స్టాంపులు, నకిలీ ధృవపత్రాలతో బెయిల్
రాజశేఖర్ అలియాస్ రాజేష్ నగరంలో ఒక లాయర్ వద్ద గుమాస్తాగా విధులు నిర్వహిస్తుండేవాడు. తన లాయర్ వద్దకు వివిధ కేసుల్లో నిందితులుగా వున్న వ్యక్తులకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు గాను అవసరమయిన పత్రాలు, పూచికత్తు సంతాకాలను సులభంగా సృష్టించేందుగాను నిందితుడు రాజశేఖర్ ఫోర్జరీ గ్యాంగ్ తో చేతులు కలిపాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అతను మిగతా నిందితులను సంప్రదించేవాడు. దీనితో మిగతా నిందితులు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయితీ రాజ్ విభాగానికి చెందిన రౌండ్ రబ్బర్ స్టాంపులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరు మీదగా హైదరాబాద్లో తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను వినియోగించుకోని నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించేవారు.
నేరాలలో ఉన్న నిందితుల బెయిల్ కోసం ఓ లాయర్ గుమస్తా నిర్వాకం
బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద గ్రామ పంచాయితీ కార్యదర్శి జారీ చేసిన రీతిలో దృవీకరణ పత్రం, ఇంటి విలువ, ఇంటి పన్నుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను సృష్టించి నిందితుడు రాజశేఖర్ కు అందజేసేవారు. నిందితులు బెయిల్ పత్రాలను కోర్టుకు అందజేసే సమయంలో ఫోర్జరీ పత్రాలతో పాటు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల ఆధార్కార్డులతో పాటు సదరు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తులు న్యాయమూర్తి ముందు హజరయ్యేవారని సీపీ వెల్లడించారు .
వాహనాల తనిఖీల్లో రబ్బర్ స్టాంపులు .. విచారణతో గ్యాంగ్ గుట్టు రట్టు
ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సుబేదారి పోలీసులు సంయుక్తంగా సుబేదారి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు రవీందర్ వాహనాన్ని అపి పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద అనధికారికంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ రాజ్ విభాగానికి సంబంధించి రౌండ్ షీల్డ్ రబ్బర్ స్టాంపులతో పాటు, ఇంటి విలువ, ఇంటి పన్ను రశీదులు దొరకడంతో నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు పాల్పడుతున్న నేరాలను అంగీకరించాడు. ఆపై నిందితుడు ఇచ్చిన సమాచారం ద్వారా మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఫోర్జరీ బెయిల్ పత్రాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడంతో పాటు, ఈ ఫోర్టరీ పత్రాలను కోర్టుకు సమర్పించి బెయిల్ పొందిన నిందితులపై విచారణ చేపట్టడం జరుగుతుందని, అదే విధంగా ఈ ఫోర్జరీ పత్రాల వ్యవహారాన్ని కోర్టు అధికారుల దృష్టికి తీసుకపోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.