వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు బిల్లా-రంగా; దండుపాళ్యం ముఠా; రేవంత్ రెడ్డి వార్నింగ్!!
టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర హనుమకొండ జిల్లాలో రాజకీయంగా కాకరేపింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక పాదయాత్రలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా సంచలనంగా మారాయి.
హన్మకొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగిందిలా
హనుమకొండలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. అనేక ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఉత్కంఠ గాను కొనసాగింది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణ చేశారు. ఆర్ట్స్ కళాశాల నుండి మొదలైన పాదయాత్ర నక్కలగుట్ట, బాలసముద్రం, బస్టాండ్, పబ్లిక్ గార్డెన్, మీదుగా హనుమకొండ చౌరస్తా వరకు సాగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.

హన్మకొండలో మాట్లాడిన వీహెచ్
ఏనుగుల గడ్డలో జరిగిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము కలిసి ఉన్నామని, తమ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవని వి హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర కెసిఆర్ దని పేర్కొన్న ఆయన ఇప్పుడు కెసిఆర్ రైతులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులను పట్టించుకోడు కానీ పంజాబ్ రైతులపై ప్రేమ కొత్తగా వచ్చిందని విహెచ్ ఎద్దేవా చేశారు.

వరంగల్ పశ్చిమ బరిలో నేనే .. నాయిని రాజేందర్ రెడ్డి
ఇక హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల బరిలో తానే ఉంటానని రేవంత్ రెడ్డి ముందే ప్రకటించారు. పక్క జిల్లాల నుండి ఎవరొచ్చినా, వేరే పార్టీల నుండి ఎవరొచ్చినా సరే వరంగల్ పశ్చిమ స్థానం నుండి తానే పోటీలో ఉంటానని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు బిల్లా, రంగాలు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
వరంగల్ ఇక హనుమకొండలో జరిగిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి హనుమకొండ లో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ అయ్యాయి. వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ ఇద్దరు బిల్లా, రంగా లాంటి వారిని పేర్కొన్నారు. వరంగల్ ఎమ్మెల్యేలు దండుపాళ్యం బ్యాచ్ లాంటివారని, భూకబ్జాలలో వీరికి మించిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటూ వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ దండుపాళ్యం ముఠాకు వార్నింగ్ ఇస్తున్నానన్న రేవంత్
వీరు కేవలం భూములనే కాకుండా పందుల్ని కూడా వదలడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు . వరంగల్ దండుపాళ్యం ముఠాకు తాను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నానని పేర్కొన్న రేవంత్ రెడ్డి మా కార్యకర్తలను వేధించిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ జెండా మోసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్న ఆయన, నాయిని రాజేందర్ రెడ్డి లాంటి వారికి సోనియా గాంధీ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ కోసం నాయిని రాజేందర్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications