రోహిత్ శర్మ దండయాత్ర- కౌంట్డౌన్ బిగిన్స్
లండన్: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కౌంట్డౌన్ మొదలైంది. ఇంకో మూడు రోజులు.. అంతే. ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్-ఆస్ట్రేలియా జట్లు సన్నద్ధమౌతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే ప్రతిష్ఠాత్మక ఫైనల్ ఇది. 2021లో సౌథాంప్టన్లో జరిగిన లో- స్కోర్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా.
ఆ సీజన్లో ఛాంపియన్గా నిలిచింది న్యూజిలాండ్. ఇప్పుడు న్యూజిలాండ్ ఫైనల్స్లో లేదు. టెస్టుల్లో నిలకడగా రాణించిన టీమిండియా ఈ ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్కు చేరుకుంది. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది. ప్రత్యర్థిగా న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా వచ్చింది. ఫైనల్స్లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్ను సాధించిన మొదటి జట్టవుతుంది.

ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. లండన్లోని ఓవల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోయే టీమిండియాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడబోతోంది భారత్. టీమిండియా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ను తీసుకుంది.
కేఎల్ రాహుల్ తరహాలోనే వికెట్ కీపర్ కమ్ ఓపెనర్గా రాణిస్తోన్న నేపథ్యంలో అతన్ని జట్టులోకి తీసుకుంది. గత సీజన్ ఫైనల్స్లో ఓడిన నేపథ్యంలో ఈ ఫైనల్స్ను భారత జట్టు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. టీమ్ మొత్తం ప్రస్తుతం లండన్లో ఉంది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ దశలవారీగా లండన్కు చేరుకున్నారు. ఓవల్లో నెట్ ప్రాక్టీస్లో బీజీగా ఉంటోన్నారు.
కాగా- టెస్ట్ ఛాంపియన్షిప్పై టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ తనదైన ముద్రను వేశాడు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ను నమోదు చేశాడు. 2019- 2021 సీజన్లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ అతనిదే. ఆ సీజన్లో 60.8 శాతం బ్యాటింగ్ యావరేజ్ను అందుకున్నాడు. 2021-23 సీజన్లోనూ అదే దూకుడును ప్రదర్శించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ యావరేజ్ 43.8 శాతం. ఓవరాల్గా 52.76 శాతం బ్యాటింగ్ యావరేజ్ను రికార్డ్ చేశాడు.

టెస్ట్ ఛాంపియన్షిప్లో రోహిత్ శర్మ ఫుల్ ఫామ్లో ఉండటం టీమిండియా బోనస్. 2021 ఫైనల్స్లో రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్లో 34, రెండో ఇన్నింగ్లో 30 పరుగులు చేశాడు. ఇప్పుడిక భారీ స్కోర్పై కన్నేశాడు హిట్ మ్యాన్. దీనికోసం నెట్ ప్రాక్టీస్లో చెమటోడుస్తోన్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్- టీమిండియా గెలుపోటములను నిర్ధారిస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
బీసీసీఐ ప్రకటించిన భారతజట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, శుభమన్ గిల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, చేతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, అజింక్య రహానె, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్. రిజర్వ్ ప్లేయర్లుగా యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ను తీసుకుంది.












Click it and Unblock the Notifications