కలెక్టర్తో పాలమూరు ఎన్నారైల భేటీ
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులతో ( ఎన్నారైలతో) కొత్త కలెక్టర్ ఉషారాణి సమావేశమయ్యారు. వారు అడిగిన వెంటనే ఆమె ఎన్నారైల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధికి ఎన్నారైలు అందిస్తున్న సేవలను స్వీకరించడానికి ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎన్నారైలు ముందు పెట్టిన ఆలోచనలకు ఆమె సానుకూలంగా ప్రతిస్పందించారు. జగదీశ్వర్ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా ఉషారాణి ఇటీవల బదిలీ అయి వచ్చారు. జగదీశ్వర్తో ఎన్నారైలకు సత్సంబంధాలున్నాయి. జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులలో ఎన్నారైలను భాగస్వాములను చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఎన్నారైలు కొత్త కలెక్టర్తో సమావేశమయ్యారు.
మోడల్ స్కూల్ ప్రోగ్రామ్, రిసోర్స్ సెంటర్ ఫర్ అబ్రాడ్ స్టడీస్, మోటివేషనల్ టాక్స్, పాలమూరు ఎడ్యుకేషన్ ఫండ్ వంటి ప్రాజెక్టుల గురించి ఎన్నారైలు కలెక్టర్కు వివరించారు. జిల్లా సమస్యలు తనకు తెలుసునని, వాటికి పరిష్కారం కనుక్కునే దిశగా సాగుతునానని కలెక్టర్ హామీ ఇచ్చారు. రీసోర్స్ సెంటర్కు తగిన వసతి ఏర్పాట్లు కల్పిస్తానని, ఎన్నారైలు నిర్వహించి వక్తలను తీసుకొస్తే మోటివేషనల్ టాక్స్కు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాలమూరు ఎన్నారై డేటాబేస్ను ఏర్పాటు చేయడానికి కూడా ఆమె సుముఖత వ్యక్తం చేశారు. ఎన్నారై ఫోరంతో సంబంధాలు కొనసాగించడానికి ఒక లాయిజన్ ఆఫీసర్ను నియమించాలని ఎన్నారైలు కోరారు. పాలమూరులో తమ కో ఆర్డినేటర్ రామచంద్రుడు బరిగెల్ల కలెక్టర్ కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంటాడని ఎన్నారైలు తెలిపారు.
ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన ఎన్నారైలు రేణుకారావు, రవి మందాడి, నర్సింహారెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రకాశ్ తాటికుంట, విజయ్ చావా, టి. రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ బొల్లు, లింగారెడ్డి, శ్రీనివాస్ ఎమ్కె, కిష్టప్ప, క్రాంతికుమార్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, నవీన్, పరమేష్ భీమ్రెడ్డి, కరుణాకర్ మాధవరం, రవి మేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.