ఎన్నారైల బతుకమ్మ
బోస్టన్ లోని హోప్ కింటన్ స్టేట్ పార్కులో న్యూ ఇంగ్లంు తెలంగాణ సంఘం ఈ నెల 22వ తేదీన బతుకమ్మ పర్వదినాన్ని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపింది. తెలంగాణ గ్రామాల్లో చెరువును తలపించే పెద్ద సరస్సు పండుగ నిర్వహణకు అదనపు ఆకర్షణగా నిలిచింది. న్యూ ఇంగ్లండు ప్రాంతానకి చెందిన దాదాపు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమర్ కర్మిల్లా స్వాగతోపన్యాసం చేశారు. సద్దులు, ఐదు రకాల అన్నం వంటకాలు, వివిధ రుచుల తెలంగాణ కూరలతో మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు జరిగాయి.
అందంగా అలంకరించిన 20 బతుకమ్మలను పేర్చారు. ఈ ఉత్సవం సంప్రదాయబద్దమైన గౌరి పూజతో మొదలైంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని పాడుతూ మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను సరస్సులో నిమజ్జనం చేశారు. పిల్లలు తమ బతుకమ్మలను తామే పేర్చుకోవడం విశేషం. ఉత్తమ బతుకమ్మ బహుమతులను వినయ, విజయ మారోజు, గీతాంజలి, నవీన పుట్టా, మంజుల గెలుచుకున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాల వి. సంధ్య విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రిటైర్డు హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జస్పాల్ సింగ్, డాక్టర్ జాఫర్, డాక్టర్ పద్మా బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు అమర్ కర్మిల్లా, వెంకట్ మారోజు, రాజేందర్ కల్వల, సురేశ్ గొట్టిముక్కల, రాయదాస్ మంతెనలకు శాంతి పుట్టా కృతజ్ఞతలు తెలిపారు.
కెనడాలోని టొరంటోలో ఈ నెల 22వ తేదీన తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ పండుగను నిర్వపించుకున్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడియఫ్) ఆధ్వర్యంలో ఈ పండుగ జరిగింది. దాదాపు 120 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చికాగో, టెక్సాస్ ల వంటి దూరప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. శోభా రాణి పీచర పాడిన బతుకమ్మ పాటలు విశేషంగా ఆకర్షించాయి. పులిహోర, గారెలు, పూర్ణాలతో మధ్యాహ్నం భోజనం చేశారు. టిడియఫ్ కో ఆర్డినేటర్ సురేందర్ పెద్ది స్వాగతం చెప్పారు. మహేష్ మాదాడి బతుకమ్మ విశిష్టతను వివరించారు. ఆచార్య సవితానంద అవధూత ఆధ్యాత్మిక విషయాలు బోధించారు. విజయ, ప్రభాకర్ మదుపు స్వామికి శాలువాలు సమర్పించారు. పిల్లలకు బహుమతి ప్రదానం జరిగింది. ఉత్తమ బతుకమ్మ బహుమతులను రజని, విజయ, స్మిత, వనజ, శైలజ గెలుచుకున్నారు. మహేష్ మాదాడి విజయ మదుపు, శ్రీధర్ ఎర్రం రెడ్డి, సురేందర్ పెద్ది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
డల్లాస్ లో కూడా అదే టిడిఎఫ్ బతుకమ్మ పండుగ జరిపింది. లేక్ లూయస్ విల్లే పార్కులో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 220 మంది వచ్చారు. రంగుల రంగుల బతుకమ్మలతో ఆ స్థలం కొత్త శోభను సంతరించుకుంది. ఇందిరా జానకీరామ్, ఉమా కరుణాకర్, స్వప్న శ్రీనివాస్ ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడ్డారు. నల్లగొండకు చెందిన కూతరు సత్యవతి నేతృత్వంలో మహిళలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ పండుగ జరుపుకున్నారు.












Click it and Unblock the Notifications