పోలేపల్లి సెజ్ బాధితులతో ఎన్నారైలు
తాము సెజ్ లకు వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం తన మిత్రులు, బంధువుల కోసం రైతుల జీవితాలతో ఆడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని విజయ చవ్వా మీడియా ప్రతినిధులతో అన్నారు. సెజ్ ల విషయంలో ప్రభుత్వ పెద్దలు తమ బంధువులు, మిత్రులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు తమ బలాన్ని పెంచుకోవడానికి వాడుకుంటూ తర్వాత బాధితులను వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. సెజ్ బాధితులను పట్టించుకోకపోతే సామాజిక అశాంతి చెలరేగుతుందని ఆయన అన్నారు.
రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, ఈ వాస్తవాన్ని విస్మరిస్తే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. పోలేపల్లి సెజ్ బాధితులు కొంత మంది బిక్షగాళ్లుగా కూడా మారారని, వారి ముందు నుంచే సెజ్ యూనిట్ల యజమానులు బడాకార్లలో సాగిపోతున్నారని ఆయన అన్నారు. పోలేపల్లి సెజ్ బాధితులు జాతీయ మానవ హక్కుల కమీషన్ కు వెళ్లాలని, అందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తాము అందిస్తామని ఆయన చెప్పారు.
ప్రభుత్వం చైనాలోని షాంఘై జిల్లాలోని సెజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆర్థిక ప్రగతిలో ప్రజలు భాగస్వాములుగా ఉన్నారని, మన దేశంలో సెజ్ లు ప్రభుత్వంలోని పెద్దల కోసమే ఏర్పడుతున్నాయని పాలమూర్ ఎన్నారైలు విమర్శించారు.