డల్లాస్లో దీపావళి సంబరాలు
భారత దేశంనుండి ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు రఘు కుంచె , ప్రముఖ గాయని సుమంగళి, మిమిక్రీ రమేష్ , వ్యాఖ్యాత అశ్విని శర్మ , ప్రముఖ కన్నడ నటి ప్రణీత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. అశ్విని శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించి, ప్రేక్షకులకు అంత్యాక్షరి పోటీ నిర్వహించి అందరిని ఉత్సాహ పరిచారు. సుమంగళి ఆలాపించిన సిరిమల్లెపువ్వా, మనసున ఉన్నది, నువ్వు నువ్వు , తెలుసునా తెలుసునా లాంటి మధురమైన పాటలు అందరిని ఆహ్లాద పరిచాయి.
రఘు కుంచె ఆలపించిన గుర్తుకొస్తున్నాయి, రావె రావె రావె సలోని, ఎందుకె రమణమ్మ పాటలు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. మిమిక్రీ కళాకారుడు రమేష్ ప్రముఖ తెలుగు నాయకులు ఎన్.టి.ఆర్ , వై.ఎస్.ఆర్, చంద్రబాబు, కిరణ్ , రోశయ్య , కే.సి.ఆర్ , బొత్స లను అనుకరించి , హాస్యాన్ని పలికించి అందరిని నవ్వుల్లో ముంచెత్తారు.
గీత దమ్మన కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటు నందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. డల్లాస్ లిటిల్ మ్యుజిసియన్స్ అకాడెమి బాల బాలికలు ఆలపించిన నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం , పిల్లలూ దేవుడూ చల్లనివారే కల్లకపట మెరుగని కరుణామయులే పాటలు అందరిని అబ్బురపరిచాయి.
అధ్యక్షురాలు గీత దమ్మన, ఉత్తరాధ్యక్షులు సురేష్ మండువ అధ్వర్యంలో కళాకారులందరినీ శాలువాతో, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా తెలుగు వెలుగు సంపాదకులు సుబ్బు జొన్నలగడ్డ దీపావళి సంచికను, అతిధుల చేతులమీదుగా అవిష్కరింప చేశారు. స్థానిక అమ్మాయిలు ప్రముఖ నటి ప్రణీతతో చేసిన సినిమా నృత్యాల కార్యక్రమం హుషారు గొలిపింది. మిమిక్రీ రమేష్ అనుకరించిన నాగార్జున, నారాయణమూర్తి, ఎన్.టి.ఆర్ మేజర్ చంద్రకాంత్ సంభాషణలు అందరినీ అలరించాయి. చివరగా స్థానిక గాయకుడు గోపి పేటూరి, సుమంగళి తో కలిసి హుషారు గొలిపే యుగళ గీతాలు బొమ్మాళీ, రబ్బరు గాజులు పాడి ప్రేక్షకులను ఉత్సాహ పరిచారు.