లండన్లో ఎన్నారైల ప్రదర్శన
ఎన్నారై ఓట్లు ప్రాముఖ్యం గురించి ప్రవాసి భారత్ వ్యవస్థాపకుడు, చైర్మన్ నాగేందర్ చిందం వివరించారు. విదేశాల్లో 8 మిలియన్ల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, భారతదేశ ఎన్నికల్లో ఈ ఓట్లు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని ఆయన అన్నారు. పది, 20 వేల ఓట్ల తేడాతో గెలిచే చాలా నియోజకవర్గాల్లో పది వేల నుంచి 15 వేల ఎన్నారై ఓట్లు ప్రత్యక్షంగా పార్లమెంటు సభ్యులను ఎంపిక చేసుకునే ఎన్నికల్లో నిర్ణాయక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
విదేశాల్లోని తమ తమ పౌరులకు కెనడా, జర్మనీ, యుకె, అమెరికా, ఇండోనేషియా, పిలిప్పైన్స్, థాయ్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలు ప్రత్యేక బ్యాలెట్ పద్ధతిని అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఎన్నారైల కోసం పోస్టల్, ఆన్లైన్ వోటింగు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆందోళనకారులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, భారత ఎన్నికల కమిషన్ను కోరారు.
ప్రజాతంత్ర వోటింగ్ హక్కు కోసం ప్రచారం సాగించాలని ప్రవాసి భారత్ ప్రెస్ అండ్ ఇన్ఫో ఆర్తి మాధవి ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని, ఇండియన్ కాన్సులేట్లకు లేఖలు రాయాలని కోర్ సభ్యుడు అశోక్ దుసారి గల్ఫ్ దేశాల ఎన్నారైలను కోరారు. వెబ్సైట్లో అవసరమైన రిక్వెస్ట్ లెటర్స్ ఉన్నాయని కోర్ మెంబర్ రాజ్ శానబోయిన చెప్పారు. కోర్ మెంబర్ డాక్టర్ నరేష్ హంచాటే భారత ప్రభుత్వానికి ఆన్లైన్ పిటిషన్ ద్వారా ఆన్లైన్ వోటింగ్ హక్కుపై సమాచారాన్ని పంపించారు.
ప్రవాసి భారత్ జట్టు సభ్యులు నాగేందర్ చిందం, ఆర్తి గుజారే, ఆశోక్ దుసారి, ప్రసన్న వెంకట మోహ్, రాజ్ శానబోయిన లండన్లోని భారత హై కమిషన్ ఎపిడబ్ల్యుఓ ఎకె షెరావత్ను కలిసి విజ్ఞప్తి పత్రం సమర్పించారు. ప్రధానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్కు రాసిన విజ్ఞప్తి పత్రాలను అందజేశారు.