వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో జంటకవుల అవధానం!

By Pratap
|
Google Oneindia TeluguNews

Texas Telugu Sahitya Sadassu
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారి సాహిత్య వేదిక నిర్వహించే "నెల నెలా తెలుగువెన్నెల" 56 వ సమావేశం ‘టెక్సాస్ సాహిత్య సదస్సు’ 28వ సమావేశం, ఈనెల 17న విశ్వవిద్యాలయం (యూ.ఎన్.టి.) లో జరిగింది. డల్లాస్ సాహితీ ప్రియులతో పాటుగా హ్యూస్టన్, ఆస్టిన్, శాన్ఏంటోనియో, కాలేజ్ స్టేషన్ నగరాల నుండి సాహిత్యాభిమానులు ఉత్సాహం గా పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆంధ్రదేశం నుండి అనేకమంది సాహితీవేత్తలు పత్యేక అతిథులుగా రావడం విశేషం.

ప్రార్థనాగీతం తరువాత సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రమణ్యం కృతజ్ఞతా పూర్వక అభినందనలతో భారతదేశం నుండి విచ్చేసిన అతిథులకూ, టెక్సాస్ నలుమూలల నుండి వచ్చిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు శుభస్వాగతం పలికారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు గీత దమ్మన్న సంస్థ కార్యకలాపాల గురించి భాషా సాహిత్యాలకు వేస్తున్న పెద్ద పీట గురించిన విషయాలను క్లుప్తంగా తమ సందేశంలో పేర్కొన్నారు.

అనంతరం భారతదేశం నుండి వచ్చిన ముఖ్య అతిథుల ప్రసంగాల తో కార్యక్రమం మొదలైంది. రచయిత్రి తెన్నేటి సుధాదేవి ‘జాతీయోద్యమ సాహిత్యం’ గురించి మాట్లాడుతూ గురజాడ ‘దేశభక్తి’ నుండి ఇటీపల వెలువడిన ‘స్వాతంత్ర్యసిధ్ధి’ వరకూ అనేక రచనలను సమీక్షించారు. ‘సమకాలీన కథా,నవలా రచనల్లో మార్పులు’ అనేఅంశంపై రచయిత్రి నందుల సుశీలాదేవి మాట్లాడుతూ కాలంతోపాటు కథ పరిమాణం కుంచించుకు పోతూ ఉందని నవలలు రావడం మరీ తగ్గిపోయిందని, రచయితల మీద బాధ్యత మరింత పెరిగిందని వివరించారు.

పదసాహిత్యపరిషత్ అధ్యక్షురాలు, పరిశోధకురాలు మంగళగిరి ప్రమీలాదేవి కొన్ని లలితగీతాలను శ్రావ్యంగా ఆలపించి ‘కృష్ణ శాస్త్రి భావ నాటికల’ గురించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. శర్మిష్ఠ, ధనుర్దాసు, వేణుకుంజం మొదలైన కృశా గేయ నాటికలను ప్రస్తావించారు. యెమన్ లో నివాసం ఉంటున్న తెలుగు వారు బాలాంత్రపు వేంకటరమణ పాండురంగమహాత్మ్యం గురించి మాట్లాడగా వారి సతీమణి శారదాదేవి పాటలు, పద్యాలు సభాసదులకు పాడి వినిపించారు.

‘వంశీ’ సంస్థ అధినేత ‘వంశీ’ రామరాజు కళాకారులు దైవస్వరూపులని, వారిని సత్కరించడం అత్యంత అవసరమని చెప్పి, టెక్సస్ లో ముఖ్యంగా డల్లాస్, హ్యూస్టన్ ప్రాంతాల తెలుగువారు ఈ విషయంలో చేస్తున్న సేవలను కొనియాడారు. సదస్సు నిర్వహిస్తున్న సాహిత్యవేదిక కార్యవర్గసభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మల్లవరపు అనంత్, జువ్వాడి రమణ, మద్దుకూరి చంద్రహాస్, ఊరిమిండి నరసింహారెడ్డి, కాజా సురేశ్, నసీం షేక్, బిల్లా ప్రవీణ్ లను అభినందించారు. ‘న్యాయంకావాలి’, ‘కోరికలేగుర్రాలైతే’ తన నవల ఆధారగా వచ్చిన సినిమాలని వివరించి ‘నవల - సినిమా అనువాదాలు’ అనే అంశంపై ప్రసిద్ద నవలా రచయిత్రి డి. కామేశ్వరి మాట్లాడారు.

తరువాత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ అద్భుత జీవితం గురించి వెలువడిన ‘రసరేఖ - సంజీవదేవ్’ పుస్తకం ఆవిష్కరణ ప్రముఖపాత్రికేయులు నరిసెట్టి ఇన్నయ్య ఆధ్వర్యంలో జరిగింది. అనీబీసెంట్, జిడ్డుకృష్ణమూర్తి, రవీంద్రుడు, చలం, దేవులపల్లి,నార్ల మొదలైన మహా వ్యక్తులతో పరిచయమున్నవారు, రాజకీయాలకతీతమైన వ్యక్తి, అయిదో తరగతితో చదువు అపేసినా మనోవిజ్ఞాన శాస్త్రంలో రచనలు చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన అసాధారణ ప్రజ్ఞావంతుడు,

రచయిత, మేధావి, చిత్రకారుడు సంజీవదేవ్ గారి గురించిన అనేక విశేషాలు ఇన్నయ్య సభతో పంచుకున్నారు. సంజీవదేవ్ గురించిన వీడియో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భోజనవిరామం అనంతరం ద్వా. నా. శాస్త్రి ‘కవిత్వం అంటే ఏమిటి, ఎందుకు’ అనే అంశంపై మాట్లాడుతూ కవిత్వానికి అసంఖ్యాక నిర్వచనాలు ఉన్నాయని, అందరిలోనూ సహజంగా ఉండే వ్యంగ్యం, హాస్యచతురత, చమత్కారం ఇవన్నీ కవిత్వపు బీజాలని చెప్పారు. కవి బాధను తెలియజేసేది, రాయకుండా ఉండలేనిది, మానవత్వం నిలబెట్టేది, ఉత్తమకవిత్వమన్నారు. తరువాత సినీగేయ రచయిత భువన చంద్ర తన కవితలను చదివి వినిపించారు.

టెక్సాస్ లోని ఇతరప్రాంతాలనుండి వచ్చిన వంగూరి చిట్టెన్ రాజు, సత్యదేవ్, డాక్టర్ నక్తారాజు కూడా తమ కవితలు చదివిన తరువాత భారత దేశం నుండి ప్రత్యేకంగా విచ్చేసిన అతిథులకు శాలువలతో, జ్ఞాపికలతో ఘన సత్కారం జరిగింది. ఆఖరుగా ప్రసిధ్ధ జంట కవులు కడిమెళ్ళ వరప్రసాద్, కోటా వేంకట లక్ష్మీ నరసింహం అష్టావధానం చేశారు. ఈ అవధానానికి పూదూర్ జగదీశ్వరన్ సంధానకర్తగా వ్యవహరించగా బాలాంత్రపు శారదాదేవి (పురాణ పఠనం), జువ్వాడి రమణ (సమస్య), నందుల సుశీలా దేవి (దత్తపది), మంగళగిరి ప్రమీలా దేవి (వర్ణన), కాజ సురేశ్ (నిషిద్ధాక్షరి), తెన్నేటి సుధాదేవి (ఆశువు), బాలాంత్రపు వెంకట రమణ (వ్యస్తాక్షరి), ద్వానా శాస్త్రి (అప్రస్తుత ప్రసంగం) పృచ్చకులుగా, రాయవరం విజయ భాస్కర్, మద్దుకూరి విజయ చంద్రహాస్, షేక్ నసీం, సిద్దా శ్రీధర్ లేఖకులు గా వ్యవహరించారు. అతివేగంగా, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ అవధానం అందరినీ అహ్లాదపరచింది.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్, కార్యవర్గ సభ్యులు జుజారే రాజేశ్వరి, వనం జ్యోతి, నేలకంటి సుభాష్, పెంటకోట సుభాషిణి, చామకూర బాల్కి, వీర్ణపు చినసత్యం, చిట్టిమల్ల రఘు, వేములపల్లి పూర్ణ చంద్రరావు , శీలం కృష్ణవేణి ,పాలక మండలి అధిపతి డా||ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు మూలుకుట్ల మూర్తి మరియు తానా అధ్యక్షులు తోటకూర ప్రసాదు ఈ సమావేశానికి విచ్చేశారు. యూ.ఎన్.టి. లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ సదస్సు నిర్వహణలో ఎంతో సహాయ సహకారాలు అందించారు. అవధానుల సన్మానంతో, అత్యంత రసవత్తరంగా నిర్వహించిన ఈ చారిత్రాత్మక 56వ నెలనెలా తెలుగు వెన్నెల మరియు 28 వ టెక్సాస్ సాహిత్య సదస్సు, పోషక దాతలైన తానా, రావు కల్వల,ఆటా వారికి మరియు మిగతా సహాయ సహకారాలు అందించిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఊరిమిండి నరసింహారెడ్డి వందన సమర్పణతో ముగిసింది.

English summary
28th Texas Telugu Sahitya Sadassu" as well as "56th Nela Nela Telugu Vennela" which were held jointly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X