భారతీయుడికి 17 ఏళ్ల జైలు

అమెరికాలోని డెట్రాయిట్లో ఆయనకు 26 మందుల దుకాణాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం అక్కడి పేద ప్రజలకు, వృద్ధుల కోసం మెడికేర్, మెడిక్ఎయిడ్ అనే రెండు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ పథకంలో ఉన్న లోపాలను పసిగట్టిన బహుభాయ్ పటేల్ వైద్యులతో కుమ్మక్కై కుంభకోణానికి తెర తీశాడు. 2006-2011 మధ్యకాలంలో రూ.300 కోట్ల మేర బిల్లులు పెట్టాడు. వాటిలోని 25 శాతం బిల్లులు నకిలీవే. అయితే, అక్కడి అధికారులు పటేల్ మోసాన్ని కాస్తా ఆలస్యంగా గుర్తించారు.
అతన్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు 17 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. అంతేకాదు, ప్రభుత్వానికి టోపీ పెట్టి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.92 కోట్ల మేర తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదే పద్ధతిలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ బ్లూక్రాస్ బ్లూషీల్డ్ను కూడా మోసం చేసినందున, ఆ సంస్థకు రూ.55 కోట్ల మేర తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసులో పటేల్కు సహకరించిన బ్రిజేష్ రావల్, అశ్విని శర్మ, లోకేష్ తయాల్లకు కోర్టు 68 నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత వారిని మళ్లీ అమెరికాకు రాకుండా చేసి, జైలు నుంచే నేరుగా వారి స్వదేశాలకు తరలించనున్నారు. వీరిలో బ్రిజేష్ కెనడావాసి కాగా, మిగతా ఇద్దరూ భారతీయులు.












Click it and Unblock the Notifications