లండన్లో మహిళా దినోత్సవం
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఆదివారంనాడు లండన్లో మహిళా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ మహిళా జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు లండన్లో తమ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ చెప్పారు. లండన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి పవిత్ర రెడ్డి అధ్యక్షత వహించారు.
సామాజిక కార్యకర్త కిరణ్ బేడీ, రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కిరణ్ బేడీ అన్నారు. చట్టసభల్లో మహిళలు తమ సత్తా చాటాలని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం విదేశాల్లో తొలి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినందుకు కవిత అభినందనలు తెలిపారు.
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, తెలంగాణకు మహిళలు చేసిన సేవలపై వక్తలు మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అధైర్యపడకుండా మహిళలు సంఘటితమై పోరాడాలని అర్చన జువ్వాడి అన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా క్విజ్ పోటీలు జరిగాయి. రాణి రుద్రమ దేవి జట్టుకు ప్రథమ బహుమతి లభించగా, సరోజినీ దేవి జట్టుకు ద్వితీయ బహుమతి లబించింది. చాకలి ఐలమ్మ జట్టుకు తృతీయ బహుమతి లభించింది. గంప జయశ్రీ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చన జువ్వాడి, దీప్తి, శ్వేత, నిర్మళ, జయశ్రీ, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.