రంగుల్లో మునిగితేలిన ఎన్నారైలు
భాను చౌదరి, కిరణ్ చెలమల్ల, హరీష్ మందాడి, శ్రీనాథ్ సదం తదితరుల నాయకత్వంలో వాలంటీర్లు కోడికూర వంటకంలో, మొక్క జొన్న బొత్తులు కాల్చడంలో మునిగిపోయారు. భారీ వృక్షాల కింద వనభోజనాలకు ఏర్పాట్లు చేస్తూ కూరగాయలు తరగడం వంటి పనులను మహిళలు చేశారు. పిల్లలు గాలిపటాలను ఎగురేస్తూ ఆనందంలో తేలియాడారు.
పెద్దలు, పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. తమ గ్రామాల్లోని వనభోజనాల మధురస్మృతులను నెమరేసుకుంటూ వంటలు చేసుకున్నారు. వంటలు పూర్తయిన తర్వాత వాలంటీర్లు వాటిని వడ్డించారు. పార్కులోని పచ్చగడ్డిపై కూర్చుని భోజనాలు చేస్తుంటే అచ్చం ఊళ్లో ఉన్నట్లే ఉందని అనుకున్నారు. తెలంగాణ కోడి కూర, ఆలూ కుర్మా, టొమాటో పప్పు, పచ్చి పులుసు నోటికి రుచిని అద్దాయి.
భోజనాల తర్వాత హోలీ వేడుకలపై దృష్టి సారించారు. రంగ్ బర్సే వంటి పాటల సంగీతాన్ని డిజె విష్ణు అందిస్తుండగా హోలీ వేడుకలతో ఆనందించారు. డిజె సంగీతానికి నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. సాయంత్రం ఐదున్నర గంటల వరకు రంగులు చల్లుకుంటూ గడిపారు.
అనిల్ బొద్దు, భాస్కర్ గార్లపాటి, దీపక్ గంట్ల, హరీష్ మందాడి, కిరణ్ కె చెలమల్ల, మహేందర్ గనపురం, మహేష్ మేరెడ్డి, మనోహర్ జంగేటి, నర్సింహా మేరెడ్డి, పరీక్షిత్ వెలమ, రఘువీర్ మరిపెద్ది, రాజేష్ పిల్లమరి, రామ్ కాసర్ల, శేఖర్ బ్రహ్మదేవర, శ్రీనివాస్ రెడ్డి (బైక్), శ్రీనాథ్ సదం, శ్రీనివాస్ డెండి, శ్రీనివాస్ దామెర, శ్రీనివాస్ సూరకంటి, శ్రీనివాస్ తిప్పన్న, సుధీర్ గూడ, సురేష్ గొట్టిముక్కల, వేంకటేశ్వర రెడ్డి సేరి, వేణు అన్నపురెడ్డి, శ్రీధర్ దేవులపల్లి ఈ వేడుకలను నిర్వహించారు.