లండన్లో తెలంగాణ అమరవీరులకు నివాళులు
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఆదివారంనాడు లండన్లో తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. హైదరాబాదు బాంబు పేలుళ్లలో మరణించినవారికి సభ సంతాపం ప్రకటించింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. సభ పడితం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ కోసం ఆత్మహత్యలు ఆపడానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు. మృతుల కుటుంబాలకు సభలో సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికి తమకు చేతనైన సాయం చేస్తామని చెప్పారు.
తెలంగాణలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రతిభామూర్తుల ఛాయాచిత్ర ప్రదర్శన జరిగింది. తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు సునీల్, శివాజీ షిండే, రాజు, సుమన్, హరి మాట్లాడారు. బలిదానాలు ఆపి, ఆత్మస్థయిర్యం నింపి, ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణను సాధించుకుంటామని చెప్పారు.
ఆత్మహత్యలు ఎలా ఆపాలనే అంశపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆత్మహత్యల నివారణ కోసం ఎన్నారైల అభిప్రాయాలు సేకరించి, ఆచరణయోగ్యమైనవాటిని స్వీకరించాలని చెబుతూ తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్కు వివరించాలని తెలంగాణ ఎన్నారై ఫోరం నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో సునీల్ మంద, విశాల్, రవి, అమర్, కిరణ్ దసుమల్లి, ప్రతాప్, జయ్, వాసు, అహ్మద్, హరి పాల్గొన్నారు. ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ అమర వీరులకు నివాళులు ఆర్పిస్తూ, దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల మృతులకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించిన ఎన్నారైలు
తెలంగాణలో ఆత్మబలిదానాలు ఆపుతామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు కొవ్వొత్తులతో అమరవీరులకు నివాళులు అర్పించారు.
తెలంగాణలో ఆత్మహత్యలను ఆపడానికి చేపట్టాల్సిన చర్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్నారైలు చర్చించారు.