హేట్ క్రైం: న్యూజెర్సీలో ఎన్నారైపై దాడి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఓ ప్రవాస భారతీయుడిపై అమెరికన్ పౌరుడు దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఎన్నారై రోడ్డుపై పడిపోయాడు. ఉదయం నడకకు వెళ్లిన సమయంలో రోహిత్ పటేల్(57) అనే వ్యక్తిని విపరీతంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.
రోహిత్ పటేల్పై దాడికి పాల్పడింది నైల్ కిల్గోర్(24) అనే యువకుడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగిందని, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడు బెయిల్పై బయటకు వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
రోహిత్ పటేల్ తమ ఇంటి సమీపంలో రోడ్డుపై నడుస్తుండగా వెనుక నుంచి కారులో వచ్చిన దుండగుడు ఆయనను తలపై తీవ్రంగా కొట్టాడని.. రోహిత్ పటేల్ కొడుకు దీపేన్ పటేల్ తెలిపారు. దీంతో తన తండ్రి తల నుంచి రక్తం కారిందని చెప్పారు. తన తండ్రి సున్నిత స్వభావంగల వ్యక్తని, అమాయకుడని ఆయన తెలిపారు.
నిందితుడికి బెయిల్ రావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితుడికి అదే రోజు రాత్రి బెయిల్ ఇచ్చారని తెలిపారు. ఇటీవలి కాలంలో భారతీయులు ఎక్కువగా ఉండే న్యూజెర్సీ ప్రాంతంలో భారతీయ అమెరికన్లపై దాడులు ఎక్కువయ్యాయని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.