చోరీకి గురైన ఎన్నారై దంపతులు
కెపిహెచ్బి పోలీసులు తెలిపిన ప్రకారం.. చోరీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వెస్టిండీస్లో డాక్టర్ శ్రీధర్, ఆయన భార్య అరుణ నివాసముంటున్నారు. వారి కుమారుడు నగరంలోని కెపిహెచ్బిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాడు. కాగా డిసెంబర్ 30న నగరానికి వచ్చిన శ్రీధర్ దంపతులు గ్రాండ్ స్వాగత్లోని ఓ గదిలో బస చేశారు.
కాగా జనవరి 1న తమ గదిలోని 7, 500 డాలర్లను, మూడు బంగారు గొలుసులు అపహరణకు గురైనట్లు వారు గుర్తించారు. తాము నిద్రిస్తున్న సమయంలో గది కిటికి గుండా ఎవరో ప్రవేశించి అపహరణకు పాల్పడ్డట్లు శ్రీధర్ అనుమానం వ్యక్తం చేశారు.
హోటల్ లోపల సిసిటీవిలు ఏర్పాటు చేయబడి ఉన్నాయని, అయితే అవి దొంగతనం జరిగిన గదిని కవర్ చేయలేకపోయాయని పోలీసులు తెలిపారు. గురువారం రోజున కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.