సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ.. పరేషాన్లో 37 వేలమంది గల్ఫ్ విద్యార్థులు!
రియాద్: సీబీఎస్ఈ పదో తరగతి గణితం, 12వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఆ పరీక్షలను తిరిగి నిర్వహించాలని సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంతో గల్ఫ్లోని వేలాది మంది ప్రవాసీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
గల్ఫ్ దేశాల్లోని 114 పరీక్షా కేంద్రాల్లో 37,687 మంది విద్యార్థులు ఈసారి 10, 12 తరగతి పరీక్షలు రాస్తున్నారు. 12వ తరగతి అనంతరం పట్టభద్ర విద్య కోసం ప్రత్యేకించి వైద్య, ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గల్ఫ్ నుంచి భారీ సంఖ్యలో స్వదేశానికి తిరిగి వస్తుంటారు. ఇందులో భాగంగానే ముందస్తుగా వీసా గడువు, విమాన టికెట్లను బుక్ చేసుకుంటుంటారు.
ప్రత్యేకించి సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల నుంచి రెసిడెన్సీ వీసాలు రద్దు చేసుకుని స్వదేశానికి వెళ్తున్న వారి సంఖ్య ఈసారి భారీగా ఉంది. ఒకసారి వీసా రద్దు చేసుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా వారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం రద్దు చేసిన పరీక్షల తేదీని ఇంకా నిర్ణయించని నేపథ్యంలో ఇక్కడి విద్యార్థుల పరిస్థితి అమ్యగోచరంగా మారింది.
ఎప్పుడు వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నట్లు దుబాయిలో పని చేసే వరంగల్ వాసి ఒకరు చెప్పారు. స్వదేశంలో సీబీఎస్ఈ పరీక్షల అనంతరం గల్ఫ్ రెసిడెన్సీ వీసాలు కల్గి ఉన్న విద్యార్థులందరూ వీసా మనుగడ కోసం విధిగా గల్ఫ్కు వచ్చి వెళుతుంటారు. నిర్ణీత కాలంలో ఇక్కడికి రాని పక్షంలో వీసా రద్దవుతుంది.
పరీక్షల అనంతరం గల్ఫ్కు రావడానికి తమ కుమార్తె ముందుగా చేసుకున్న ప్రణాళిక ఇప్పుడు గందరగోళంగా మారిందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజు వాపోయారు. గణితం పరీక్ష తేదీని వెంటనే ప్రకటిస్తే.. విమానాల టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని విజయవాడకు చెందిన మరో వ్యక్తి అన్నారు.
గతంలో గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యేక ప్రశ్నపత్రాలు.. ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉండేవి. ఈసారి అన్ని సీబీఎస్ఈ పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రాలు రూపొందించారు. పైగా గల్ఫ్ దేశాల్లో ఎనిమిదేళ్లుగా ఉన్న సీఈఈ విధానాన్ని రద్దు చేసి ఈసారి పదో తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలను నిర్వహించారు.