సంక్రాంతి వేడుకల్లో నటి రోజారమణి
డాల్లస్/ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు కాప్పెల్ మిడిల్ స్కూల్ వెస్ట్ లో ఏర్పాటు చేసిన "సంక్రాంతి సంబరాలు" అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా జరిగాయి. సంస్థ 2014 అధ్యక్షులు విజయమోహన్ కాకర్ల, కార్యక్రమ సమన్వయకర్త చినసత్యం వీర్నపు ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్తలు జ్యోతి వనం, కృష్ణవేణి శీలం ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో సభ ప్రాంగణం బొమ్మల కొలువుతో అలంకరించారు. దాదాపు 800 మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
సుమారు 200 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం అచ్చ తెలుగు వాతావరణాన్ని అణువణువున ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేశారు. వెంకట్ ములుకుట్ల అధ్వర్యంలో వినాయకుడి పాటతో, సాహితి కాజ బృందం నిర్వహణలో అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది.

సుప్రియా ఓబిలి నిర్వహణలో ‘కౌతువం' శాస్త్రీయ నృత్యం, జ్యోతి కందిమళ్ళ బృందం ప్రదర్శించిన చిన్నారుల గొబ్బిళ్ళు, రూప బంద వారి జానపద నృత్యాలు, గురు శ్రీలతా సూరి నిర్వహణలో నాట్యాంజలి బృందం వారి "స్వరలయనాట్యాంజలి' శాస్త్రీయ నృత్యం, శ్రీదేవి నువ్వుల, రంజీత ఆచార్య, నలిని అట్టం మరియు యోగిత మండువ దర్శకత్వంలో ప్రదర్శించిన వివిధ చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాలు, రూప బంద బృందం వారి "మువ్వ గోపాలం", ఎల్.ఎం.ఏ. వారి బాల బాలికలు ఆలపించిన పాటలు, గురు పద్మ శొంటి ఆధ్వర్యంలో కూచిపూడి కళాక్షేత్ర బృందం వారి "పాలోయమ్మ పాలు" నృత్యం ప్రేక్షకులని ఎంతో ఆకొట్టుకున్నాయి. 83 మంది పిల్లలతో ‘జాతీయ సమైక్యత' అంశం మీద ప్రదర్శించిన నృత్యం ఆహ్వానితులను ఎంతో ఆనందంలో ముంచివేసి నేటి కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిగా చక్రపాణి నేతృత్వంలో నిర్వహించిన చలన చిత్ర మిశ్రమ నృత్యం ఆహూతులను ఉర్రూతలూగించింది.
అలనాటి బాలనటి, నేటి నటి శ్రీమతి రోజారమణి ఈ సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథిగా
ప్రత్యేకంగా విచ్చేసి, వారి సినీ అనుభవాలను ముచ్చటగా సభ్యులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా రోజారమణి కి "బహుభాషా నట శిరోమణి" బిరుదు ప్రదానం చేయడం జరిగినది.
2013 అధ్యక్షులు సురేష్ మండువ 2013 పాలకమండలి అధిపతి రామకృష్ణ లావు
ప్రసంగిస్తూ- తమకు సహాయ సహకారాలు అందించిన కార్య వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. సురేష్ మండువ తమ ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త కార్యక్రమాల వివరాలు సభ్యులతో పంచుకున్నారు. ఆ తరువాత సంస్థ నూతన అధ్యక్షులు విజయ మోహన్ కాకర్ల ను సభకు పరిచయం చేసారు. అధ్యక్షులు కాకర్ల విజయ మోహన్ 2014 నూతన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేస్తూ, డా.ఊరిమిండి నరసింహారెడ్డి ఉత్తరాధ్యక్షుడుగా, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షుడుగా, ఉప్పలపాటి కృష్ణారెడ్డి కార్యదర్శిగా, ఆదిభట్ల మహేష్ ఆదిత్య సంయుక్త కార్యదర్శిగా, వీర్నపు చినసత్యం కోశాధికారిగా, శీలం కృష్ణవేణి సంయుక్త కోశాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు.
సభని ఉద్దేశిస్తూ నూతన అధ్యక్షులు విజయ మోహన్ కాకర్ల 2014 సంవత్సరంలో వివిధ సాంస్కృతిక, ఆరోగ్య, క్రీడా రంగాలలొ చేపట్టబోవు కార్యక్రమాలను తెలిపారు. తన కార్యవర్గ సభ్యులందరినీ "సమైక్య బృందం" గా వ్యవహరించి మన సభ్యుల మనుగడ కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు.పాలక మండలి నూతన అధిపతి మూర్తి ములుకుట్ల తన బృందం సభ్యులైన ఉపాధిపతి అజయ్ రెడ్డి,
డా.సి.ఆర్.రావు, శ్రీనివాస్ రెడ్డి గుర్రం, సుగన్ చాగర్లమూడి లను సభకు పరిచయం చేసారు.
కాకర్ల విజయమోహన్, డా.ఊరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలకమండలి నూతన అధిపతి మూర్తి ములుకుట్ల సంయుక్తంగా మండువ దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆ తరువాత విజయమోహన్ కాకర్ల, సురేష్ మండువ సంయుక్తంగా లావు దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
టాంటెక్స్ సంస్థకు గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన సుభాష్ నేలకంటి, ఇందు రెడ్డి మందాడి, అనంత్ మల్లవరపు, రాజేష్ చిలుకూరి లను, మరియు పాలక మండలి సభ్యులుగా పదవీవిరమణ చేసిన డా. గూడూరు రమణారెడ్డి, 2013 ఎన్నికల సమితి సభ్యులను, 2013 పోషక దాతలను సురేష్ మండువ, విజయ మోహన్ కాకర్ల, మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షుడు, తానా తక్షణ పూర్వాధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ ఇటీవలే గౌరవ డాక్టరేట్ మరియు అక్కినేని ఉత్తమ పురస్కారం అందుకున్నందుకు టాంటెక్స్ ప్రస్తుత, పూర్వాధ్యక్షుల బృందం సంయుక్తంగా సన్మానించారు
ఇటీవలే పరమపదించిన ప్రముఖ చలన చిత్ర తారలు ఏ.వి.ఎస్., శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉదయ కిరణ్, అంజలి దేవి లను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మలు శాంతించాలని సభ ఒక నిముషం పాటు మౌనం వహించింది.
2013 సాంస్కృతిక సమన్వయ కర్తల ద్వయం శీలం కృష్ణవేణి, వనం జ్యోతి తమకు సంవత్సరం పొడుగునా సహకరించిన కార్యకర్తల జట్టుకు కృతజ్ఞతాపూర్వక అభివందనం తెలియజేస్తూ 2014వ సంవత్సరంలో సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టబోవు సింగిరెడ్డి శారదను సభకు పరిచయం చేసారు.
"సంక్రాంతి సంబరాలు" కార్యక్రమ సమన్వయకర్త చినసత్యం వీర్నపు ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు కృతజ్ఝతలు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అద్భుతంగా పనిచేసిన రాజేశ్వరి చల్లా, బస్వి ఆయులూరి, శిరీష వూటూరి, సంజన పడిగెల, వార్తిక వరాటి లకు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications