పాకిస్తాన్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజలుల్లా హతం?
ఇస్లామాబాద్: పాక్ సైన్యం జరిపిన ద్రోణి దాడుల్లో పాక్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా హతమైనట్లు పాక్ మీడియాలో శనివారం విస్తృతంగా వార్తా కథనాలు వచ్చాయి. పెషావర్లో ఇటీవల జరిగిన సైనిక పాఠశాలపై తీవ్రవాదుల దాడిలో 148 మంది హతమైన ఘటనకు ఫజులుల్లానే సూత్రధారిని పాక్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ పెషావర్ ఘటన అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని స్వాత్ లోయని తాలిబన్ స్థావరాలపై పాక్ సైన్యం ద్రోణి దాడులు చేసింది.
ఈ దాడుల్లో ఫజులుల్లా మృతి చెందినట్లు తెలిపింది. ఇన్నాళ్లు ఫజ్లుల్లా గురించి తెలిసినా పట్టించుకోనట్టు ఉన్న పాక్ పెద్దలు పెషావర్ దాడితో సైనిక దాడులు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫజ్లుల్లా స్థావరం గురించి పక్కాగా తెలుసుకున్న సైన్యం ద్రోణి దాడులతో మట్టుపెట్టినట్టు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అఫ్గనిస్తాన్లోని నంగర్హార్ ప్రొవిన్స్లో పాకిస్తాన్ సైన్యం ఫజలుల్లాతో పాటు ఎనిమిది తెహ్రీక్ - ఎ - తాలిబన్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు చెబుతున్నారు.
డిసెంబర్ 16వ తేదీన పెషావర్ ఆర్మీ స్కూల్పై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కాబూల్ను సందర్శించారు. తెహ్రీక్ - ఎ - తాలిబన్ ఆర్మీ స్కూల్పై దాడి చేసింది తామేనని ప్రకటించుకుంది. అ స్థితిలో దాని నాయకుడి కోసం వేట సాగిస్తామని షరీఫ్ చెప్పారు.
ఫజలుల్లా రేడియో ముల్లాగా పేరు సంపాదించుకున్నాడు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్జాయ్పై దాడికి కూడా అతనే కారణమని అంటున్నారు. పజలుల్లా మృతి గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం సోషల్ మీడియా ఖాతాల్లో సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. అతని హతం పుకారు మాత్రమేనని పాకిస్తాన్ సాయుధ బలగాల మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ ప్రజా సంబంధాల అధికారి అన్నారు. ఆ సమాచారాన్ని ధ్రువీకరించకోవాల్సి ఉందని ట్విట్టర్లో అన్నారు. పాకిస్తాన్కు చెందిన ద నేషన్ కూడా వార్తలను ధ్రువీకరించడం లేదంటూ వార్తాకథనాన్ని ప్రచురించింది.