అడ్డగించి ఆటోలో ఎత్తుకెళ్లి మహిళను రేప్ చేశారు

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చెర్లపల్లి సమీపంలో ఒక వివాహిత(34)పై ఆదివారం రాత్రి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి మండలం జూలపల్లికి చెందిన ఆ బాధితురాలు మూడు నెలల క్రితం జడ్చర్లలోని తాకట్టు దుకాణంలో బంగారం కుదువపెట్టింది. అందుకు సంబంధించిన రసీదు నసరుల్లాబాద్లోని సోదరి వద్ద ఉంది. దాన్ని తీసుకొనేందుకు ఆమె ఆదివారం జూలపల్లికి చెందిన శ్రీనుతో కలిసి నసరుల్లాబాద్ వచ్చింది. ఆమె సోదరి లేకపోవడంతో ఇంటి ముందు నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు వారితో గొడవ పెట్టుకున్నారు. దీంతో వారు జడ్చర్లకు కాలినడకన బయలు దేరారు.
కాగా, అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీను, పరుశురాములు, రాజు, గంగాపురం జంగయ్య, ఊశయ్య, మణ్యం, వెంకటయ్య వారిని వెంబడించి రాత్రి 10.30 గంటల సమయంలో చెర్లపల్లి స్టేజీ వద్ద అడ్డగించారు. వారిని కొట్టి ఆటోలో ఎత్తుకెళ్లి సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో సామూహిక అత్యాచారం చేశారు. వారిద్దరినీ బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వదిలి పరారయ్యారు. సోమవారం ఉదయం బాధితులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దారుణంపై విచారణ జరిపిన మహబూబ్నగర్ ఆర్డీఓ వెంకటేశ్వర్రెడ్డి, డీఎస్పీ మల్లికార్జున బాధితురాలిని, గాయపడిన శ్రీనును బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులు ఏడుగురిలో ఆటోడ్రైవర్ శ్రీను, పరుశురాములు, రాజు, గంగాపురం జంగయ్య, ఊశయ్య, మణ్యంలను సాయంత్రం అరెస్ట్ చేశామని, వెంకటయ్య పరారీలో ఉన్నాడని జడ్చర్ల సీఐ వెంకటరమణ తెలిపారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా హసన్పర్తిమండలం నాగారంలో బాలిక (15)పై అత్యాచారం చేసిన బండారి విజయ్, లేదళ్ల వెంకటేశ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఒంటరిగా వున్న బాలికపై గత గురువారం అత్యాచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పలువురు మహిళలు సోమవారం పోలీస్స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టి నినాదాలు చేశారు. దీంతో కాజీపేట ఏఎస్పీ కోయ ప్రవీణ్ వచ్చి బాధిత బాలికకకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్సై కృష్ణకుమార్ నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications