జగన్ సర్కారు వైఫల్యమే, హిందుత్వంపైనే ఎందుకిలా?: పాక్లోనే అనుకుంటే ఏపీలోనూ: పవన్ కళ్యాణ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి విగ్రహం ధ్వంసంతో ఏపీలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారని, ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని అన్నారు. హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బతీసేలా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీరాంనగర్ ప్రాంతంలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మేణ్యేశ్వర స్వామ విగ్రహం చేతులను దుండగులు విరగ్గొట్టిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్లోనే.. ఇప్పుడు ఏపీలోనూ..
‘పాకిస్థాన్ దేశంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలు పగలగొడుతూ ఉంటారని చదువుతూ ఉంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం. రామ నామాన్ని జపించే పవిత్ర భూమి మనది.. రామ కోటి సభక్తికంగా రాసే నేల ఇది.. రామాలయం లేని ఊరంటూ కనిపించదు మనదేశంలో. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం. మన రాష్ట్రంలో ఆ భావనలు చెరిపేయాలనుకుంటున్నారా?' అని ఏపీ సర్కారును పవన్ కళ్యాణ్ నిలదీశారు.

హిందూ దేవుళ్ల విగ్రహాలపై వరుస దాడులు దేనికి సంకేతం?
భద్రాచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలనుకున్న రామతీర్థం క్షేత్రంలో కొద్ది రోజుల కిందటే కోదండరాములవారి విగ్రహం తలను నరికి పడేసే మత మౌఢ్యం పెచ్ఛరిల్లడం ఆందోళనకరం. ఈ బాధ భక్తుల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు దేవ గణాలకు సేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మేణ్యేశ్వరస్వామి వారి విగ్రహం చేతులను నిరికేయడం చూస్తే ధ్వంస రచన పరాకాష్టకు చేరుతున్నట్లు అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. రామతీర్థం క్షేత్రంలో కోదండ రాముని విగ్రహాన్ని పగలగొట్టడం.. అంతకుముందు పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలబెట్టడం చూస్తుంటే ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

శ్రీరాముడి విగ్రహం తల నరికితే.. సీఎం జగన్ స్పందన అలానా?
రామతీర్థం క్షేత్రంలో శ్రీకోదండరాముల వారి విగ్రహం తలను నరికిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందన ఉదాసీనంగా ఉందన్నారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ చెప్పడం చూస్తే ఈ వరుస దాడులపై ఆయన ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు నేరం చేసేవారిని నిలువరించవు సరికదా.. మరో దుశ్చర్యకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఈ ఘటనలకు ఇతర పక్షాలే కారణం అంటూ అధికార పక్షంవాళ్లు చెబుతున్నారు. మరివారి చేతుల్లోనే పోలీసు, నిఘా విభాగాలు ఉంటాయి కదా.. బాధ్యతులను ఇప్పటి వరకు ఎందుకు గుర్తించి అరెస్టు చేయడం లేదని పవన్ కళ్యాణ్.. జగన్ సర్కారును ప్రశ్నించారు.

హిందూ ఆలయాలపై దాడి జరిగితే అంత ఉదాసీనత ఎందుకు?
దేవుడిపై భారం వేసేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అంతర్వేది ఘటనపై నిరసన తెలిపినవారిపైనా.. అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆఘమేఘాలపై కేసులు పెట్టిన ప్రభుత్వం.. హిందూ ఆలయాలు, దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఏపీలో దేవాదాయ శాఖ అనేది ఉందా?
విజయవాడ అమ్మవారి ఆలయ రథంలో వెండి విగ్రహాల అపహరణ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పిఠాపురం, కొండబిట్రగుంట కేసులు ఎటుపోయాయో ప్రజలకు అర్థం కావడం లేదు. వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా? అనిపిస్తుంది. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలి. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలి. అప్పుడే మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications